Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలో 450% పెరిగిన ఎన్పీఏలు
- మార్చి నాటికి 1.09 లక్షల కోట్లకు చేరిక
- ప్రభుత్వేతర బ్యాంకుల్లోనూ మారని సీన్..
- అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్లో నమోదు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగంలోని డొల్లతనం మరోమారు నిరూపితమైంది. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలోని బ్యాంకులకే పరిమితమైన భారీ స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్ఫీఏ) బెడద.. క్రమంగా ప్రయివేటు బ్యాంకుల్లోనూ వెలుగు చూస్తోంది. గడిచిన అయిదేండ్లలో ప్రయివేటు బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల పెరగుదలలో 450% మేర వృద్ధి నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన ఒక కథనం మేరకు 2013-14లో రూ.19,800 కోట్లకు పరిమితమైన ప్రయివేటు బ్యాంకుల ఎన్పీఏలు.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.1,09,076 కోట్లకు చేరుకున్నాయి. నిరర్థక ఆస్తులు భారీగా పెరిగిన ప్రయివేటు బ్యాంకుల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యెస్ బ్యాంకులు ముందు వరుసలో ఉన్నాయి.
ముందంజలో ఐసీఐసీఐ బ్యాంక్..
దేశంలోని అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ నిరర్థక ఆస్తుల విషయంలో ముందంజలో ఉంది. గడిచిన అయిదేండ్ల కాలంలో ఈ బ్యాంక్ ఎన్పీఏలు 514 శాతం మేర పెరిగి రూ.54.063 కోట్లకు చేరుకున్నాయి. ఇదే బాటలో యాక్సిస్ బ్యాంక్లో మొండి బాకీల వృద్ధి 988 శాతంగా నమోదు అయింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3,146 కోట్లుగా ఉన్న ఈ బ్యాంక్ ఎన్పీఏలు మార్చి నాటికి రూ.34,249 కోట్లకు చేరడం విశేషం. ఎన్పీఏల వర్గీకరణలో యాక్సిస్ బ్యాంక్ నిబంధనలను పాటించనందుకు గాను ఆర్బీఐ ఈ బ్యాంక్కు రూ.3 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొండి బాకీలు గడిచిన అయిదేండ్లలో రూ.2,989 కోట్ల నుంచి రూ.8,607 కోట్లకు చేరాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎన్పీఏలు రూ.1059 కోట్ల నుంచి రూ.3825 కోట్లకు ఎగిశాయి. మరోవైపు ఇదే సమయంలో యెస్ బ్యాంక్ ఎన్పీఏలు రూ.175 కోట్ల నుంచి రూ.2,627 కోట్లకు చేరాయి. ఆర్బీఐ రిస్క్ అసెస్మెంట్లో యెస్ బ్యాంక్ దాదాపు రూ.6350 కోట్ల మేర తక్కువగా ఎన్పీఏలను రిపోర్ట్ చేసినట్టుగా తెలిన విషయం విదితమే.
ఆర్బీఐ కఠిన వైఖరితో వెలుగులోకి వాస్తవాలు..
నిరర్థక ఆస్తుల గుర్తింపు, బయటకు వెల్లడించే విషయమై నిబంధనల్లో సవరణలు చేస్తూ పెద్ద బ్యాంకు వాటి అమలును కఠినతరం చేయడంతో బ్యాంకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎన్పీఏలను వివిధ రూపాల్లో దాచుతూ వచ్చిన బ్యాంకులు ఇప్పుడు వాస్తవాలను వెల్లడించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆయా బ్యాంకులు తమ ఆస్తుల నాణ్యతను కాపాడుకొనేందుకు గాను డిఫాల్టరుగా మారిన సంస్థలకు సంబంధించి కేవలం 180 రోజుల్లోనే రిజల్యూషన్ ప్లాన్ను బ్యాంకులు బయటకు వెల్లడించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో ప్రయివేటు బ్యాంకులు విధిలేని పరిస్థితుల్లో వాస్తవ ఎన్పీఏలను బయటకు వెలువరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల ఎన్ఫీఏలు గడిచిన అయిదేండ్లలో 450 శాతం పెరిగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
బ్యాంకులకు కాస్త ఉపశమనం..
బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో పెట్టే క్రమంలో భాగంగా సర్కారు అమలులోకి తెచ్చిన కొత్త దివాలా చట్టంతో బ్యాంకులకు కాస్త ఉపశమనం కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా బ్యాంక్రప్టసీ చట్టంలో భాగంగా దివాలా తీసిన భూషణ్ స్టీల్ సంస్థలో వాటాను కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. ఈ వ్యవహారంతో భూషణ్ స్టీల్కు దాదాపు రూ.56,000 కోట్ల మేర రుణాలిచ్చిన భారతీయ స్టేట్ బ్యాంక్ కూటమికి దాదాపు రూ.56000 కోట్ల మేర సొమ్ము తిరిగి చేతికందనుంది. ఇదే క్రమంలో బ్యాంకులు దివాలా చట్టాన్ని ఆసరాగా చేసుకొని చర్యలు చేపడితే రానున్న రోజుల్లో డర్టీ డజన్ కంపెనీల నుంచి దాదాపు రూ.లక్ష కోట్ల వరకు మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా బ్యాంకింగ్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.