Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ను (ఎస్బీఐ) మొండి బాకీలు ఇబ్బంది పెడుతున్నాయి. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పేరుకుపోతుండటంతో జనవరి-మార్చి త్రైమాసికానికి బ్యాంకు అంచనాలను మించిన భారీ నష్టాలను నమోదు చేసింది. గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు రూ.7,718కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు డిసెంబరు త్రైమాసికంలో బ్యాంక్ రూ. 2,416.37 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. కాగా అంతకు ముందు ఏడాది (2016-17 ఆర్థిక సంవత్సరం) ఇదే త్రైమాసికంలో ఎస్బీఐ రూ. 2,814.82కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. ఈ త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం మాత్రం రూ.68,436.06 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఎస్బీఐ ఆదాయం రూ.57,720.07 కోట్లుగా నమోదు అయింది. మార్చి త్రైమాసికంలో రాని బాకీల నిమత్తం కేటాయింపులు రూ.28,096 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో ఇవి రూ.11,740 కోట్లుగా ఉన్నాయి. బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 10.91 శాతానికి పెరిగాయి. అంతకు ముందు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఇవి 10.35 శాతం ఉండగా.. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఎన్పీఏలు 9.1 శాతంగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో బ్యాంకు నికర నిరర్థక ఆస్తులు 5.73 శాతానికి పెరిగాయి. డిసెంబరు త్రైమాసికంలో ఇవి 5.61శాతంగా ఉండగా.. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 5.19శాతంగా నిలిచాయి.