Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 శాతం క్షీణించిన కంపెనీ లాభం
- 400% తుది డివిడెండ్కు సిఫారసు
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ సంస్థ మార్చితో ముగిసిన త్రైమాసికానికి నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో సంస్థ నికర లాభం దాదాపు 19% మేర కుంగి రూ.272.1 కోట్లకు పరిమితమైంది (భారత అకౌంటింగ్ నిబంధనల ప్రకారం). అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.337.6 కోట్లుగా ఉంది. డాలరుతో రూపాయి విలువ క్షీణించడం, అమెరికా అమలులోకి తెచ్చిన 'ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్ -2017', పోటీ పెరిగిపోవడం తదితర ప్రతికూలతలు కంపెనీ ఆర్థిక ఫలితాలపై పెను భారాన్ని చూపాయి. ఇదే కాలంలో సంస్థ ఆదాయం కూడా 1.60% తగ్గి రూ.3,611.9 కోట్ల నుంచి రూ.3,553.9 కోట్లకు కుంగింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ మొత్తం నికర లాభం 26.72% మేర కుంగి రూ.1,292.1 కోట్ల నుంచి రూ.946.8 కోట్లకు జారుకుంది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.14,281 కోట్ల దరిదాపుల్లోనే నిలిచిపోయింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 400% (రూ.20) తుది డివిడెండ్ను చెల్లించేందుకు గాను కంపెనీ బోర్డు సమ్మతి తెలిపింది. కంపెనీ సీఈవో, సహ చైర్మెన్ జి.వి. ప్రసాద్ మాట్లాడుతూ అమెరికా నుంచి వెల్లడైన ప్రతికూలత, రష్యాలో అమ్మకాలు పడిపోవడం కోనుగోళ్ల చానెల్లో మార్పులు ఫలితాలపై ప్రభావం చూపినట్టుగా వివరించారు.