Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లకు అమ్మకాల దెబ్బ
- సెన్సెక్స్ 306 పాయింట్ల పతనం
- నెల కనిష్టానికి క్షీణత
- 10,500 దిగువన నిఫ్టీ
- స్టెరిలైట్ కాపర్ మాతృసంస్థ షేర్లు కుదేలు
ముంబయి : కర్నాటకలో బిజెపికి పరాభవానికి తోడు చమురు ధరల మంట దేశీయ స్టాక్ మార్కెట్లను బెంబేలెత్తిస్తోంది. వరుసగా ఐదు సెషన్ల నష్టాల నుంచి ఉపశమనం లభించిందన్న కొద్ది పాటి ఆశలు ఒక్క పూట కూడా నిలువలేదు. మార్కెట్లు తిరిగి బుధవారం భారీ నష్టాలను చవి చూశాయి. వివిధ ప్రతికూల పరిణామాల మధ్య మదుపర్ల అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 306 పాయింట్లు లేదా 0.88 శాతం కోల్పోయి 34,344.91కి పడిపోయింది. దీంతో నెల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఈ సూచీ గత ఏప్రిల్ 19న ఈ స్థాయిలో చోటు చేసుకుంది. ఇంట్రా ట్రేడింగ్లో 34,656.63-34,668 మధ్య కదలాడింది. ఇంతక్రితం ఆరు సెషన్లలో మంగళవారం మాత్రం స్వల్పంగా లాభపడగా, మిగితా సెషన్లలో దాదాపుగా 950 పాయింట్ల మేర కోల్పోయింది. తాజా సెషన్లో ఎన్ఎస్ఇ నిఫ్టీ 106.35 పాయింట్లు లేదా 1,01 శాతం పతనమై 10,430.35 వద్ద ముగిసింది. ఇంతక్రితం సెషన్లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1,651.63 కోట్ల నికర షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు 1,496.83 ఈక్విటీలను కొనుగోలు చేశారు.
ప్రధాన కారణాలు..
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 80 డాలర్లకు చేరడం, దేశంలో పెట్రోల్, డీజిల్ మంట సెన్సెక్స్, నిఫ్టీలను కుప్పకూలేలా చేశాయి. ముడి చమురు ధరలకు తోడు ద్రవ్యోల్బణం ఎగిసిపడనుందని, దీంతో రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న విశ్లేషణలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.
వేదాంత షేర్లకు స్టెరిలైట్ షాక్..
తమిళనాడులో తూత్తుకుడిలో స్టెరిలైట్ వ్యతిరేక ఆందోళనల సెగ స్టాక్ మార్కెట్లను తాకింది. మరోవైపు మద్రాస్ హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించనుందన్న అంచనాలు వేదాంత షేర్ను మరింత కుంగదీశాయి. వేదాంత రిసోర్సెస్కు చెందిన తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ను మూసివేయాలని స్థానికులు చేసిన ఆందోళనపై పోలీసులు కాల్పులు జరిపి 12 మందిని పొట్టన పెట్టుకున్నారు. వందలాది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ పరిణామంతో బిఎస్ఇలో వేదాంత షేర్ 6.23 శాతం లేదా రూ.16.80 పడిపోయి రూ.252.70 వద్ద ముగిసింది. రూ.264 వద్ద మొదలైన సూచీ ఇంట్రా ట్రేడింగ్లో ఏకంగా 250.15 కనిష్ట స్థాయిని తాకింది.