Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండింతలకు పైగా పెరిగిన నికర లాభం
- రూ.14ల తుది డివిడెండ్కు బోర్డు సై
న్యూఢిల్లీ: ఐటీ రంగ సేవల సంస్థ టెక్ మహీంద్రా మార్చి త్రైమాసికానికి దుమ్ము లేపే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి సంస్థ లాభం రెండింతల కంటే అధికంగా పెరిగి రూ.1,222 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం కేవలం రూ.587.9 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ ఏకీకృత ఆదాయం 7.4 శాతం మేర పెరిగి రూ.7,495 కోట్ల నుంచి రూ.8,054.5 కోట్లకు చేరుకుంది. మార్కెట్లో ఒడుదుడుకులతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ కంపెనీ మెరుగైన పనితీరు కనబరిచగలిగిందని.. టెక్ మహీంద్రా వైస్ చైర్మెన్ వినీత్ నయ్యర్ అన్నారు. మార్చితో ముగిసిన మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ నికర లాభం దాదాపు 35 శాతం మేర ఎగిసి రూ.3,800 కోట్లకు చేరువైంది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 5.6 శాతం మేర పెరిగి రూ.30,773 కోట్లుగా నమోదు అయింది. డిజిటల్ విభాగంలో వృద్ధి ప్రోత్సాహకరంగా ఉండడం వల్లే సంస్థ మొత్తం ఆర్థిక సంవత్సరానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేయగలిగిందని సంస్థ సీఈవో సీపీ గుర్నాని తెలిపారు. మార్చి నాటికి సంస్థలో 1,12,807 మంది ఉద్యోగుల పని చేస్తున్నారని. సంస్థ వద్ద దాదాపు రూ.7,774 కోట్ల నగదు, నగదుకు సమానమైన సొత్తు ఉన్నట్టుగా కంపెనీ తెలిపింది. ఖాతాలో మొత్తం 913 మంది క్లయింట్లు ఉన్నారని వివరించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.14ల తుది డివిడెండ్ను ఇవ్వాలని డైరెక్టర్లబోర్డు సిఫారసు చేసింది.