Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు ధరల్లో కరెక్షన్తో కొత్త ఊపు
- లాభాల్లో నిలిచిన అన్ని రంగాల స్టాక్స్
- 262 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్్
- 10,605 పాయింట్ల ఎగువకు నిఫ్టీ
ముంబయి: ముడి చమురు ధరల్లో కరెక్షన్, రూపాయి బలపడటం తదితర అనుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలోనూ మురిశాయి. దేశీయ, అంతర్జాతీయల అనుకూలతల నేపథ్యంలో సూచీలు గురువారం నాటి జోష్ను శుక్రవారం కూడా కొనసాగించాయి. గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు కిందకి పడిపోయాయి. రష్యా నుంచి ఆయిల్ సప్లై పెరుగుతుందనే సంకేతాలతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3 శాతం పడిపోయి బ్యారల్కు 78 డాలర్లుగా నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారల్కు 80.50 డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు రూపాయి విలువ కూడా వరుసగా రెండో రోజు బలపడింది. 18 నెలల కనిష్టస్థాయిల నుంచి 55 పైసల వరకు లాభపడి రూ.67.79గా నమోదైంది. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్సియల్, చమురు, మెటల్స్, టెక్నాలజీ స్టాక్స్ మార్కెట్కు మద్దతునిచ్చాయి. శుక్రవారం ఉదయం 60 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరి వరకూ లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం వరకు అదే జోరును కొనసాగిస్తూ.. చివరికి 261.76 పాయింట్లు లాభపడి 34,924.87 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 91.30పాయింట్లు లాభపడి 10,605.15వద్ద ముగిసింది. శుక్రవారం నాటి ట్రేడింగ్లో సూచీలు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 2 శాతం వరకు ర్యాలీ కనబరచడం విశేషం. శుక్రవారం నాటి మార్కెట్లో అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ట్రేడవ్వడం విశేషం. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు లాభాల బాట కొనసాగించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, ఐబీ హౌసింగ్, హిందాల్కో, హెచ్పీసీఎల్, బజాజ్ ఫిన్, ఓఎన్జీసీ, గెయిల్, టాటా స్టీల్, యస్బ్యాంక్, బీపీసీఎల్లు 5.4-2.7 శాతం లాభపడగా.. ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ 1-0.5 శాతం మధ్య నష్టాలలో ముగిశాయి.