Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వీడియోకాన్ రుణ మంజూరీ కేసు ఐసీఐసీఐ బ్యాంక్ అధినేత్రి చందాకొచ్చర్ను ఇప్పట్లో వీడేట్టులేదు. శుక్రవారం ఈ కేసుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) చందాకొచ్చర్కు నోటీసులను జారీ చేసింది. రూ.3250 కోట్ల వీడియోకాన్ రుణ కేసులో కొచ్చర్కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై సెబీ ఈ నోటీసులు పంపంది. ఈ విషయాన్ని బ్యాంకు శుక్రవారం ధ్రువీకరించింది. వీడియోకాన్ కేసు విషయంలో సరియైన వివరణను స్టాక్ మార్కెట్లకు బ్యాంకు ఇవ్వలేదని మార్కెట్ రెగ్యులేటరీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్సీఆర్ రూల్స్ 2005, రూల్ 4(1) కింద సెబీ ఈ నోటీసును జారీచేసినట్టు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. గురువారమే తమ బ్యాంకు ఈ నోటీసులు అందుకుందని, వీడియోకాన్ గ్రూప్ అండ్ న్యూపర్ రెన్యువబుల్స్ మధ్య డీలింగ్స్ విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుడటంతో పాటు, ఈ రుణ కేసులో సంబంధం ఉన్నట్టు వస్తున్న ఆరోపణలపై స్పందించాలని సెబీ కొచ్చర్ను కోరిందని బ్యాంక్ వెల్లడించింది. సెబీకి తాము సరియైన వివరణ ఇస్తామని ఐసీఐసీఐ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది
దీపక్ కొచ్చర్ వ్యవహారంపై అనుమానాలు..
2008లో వీడియోకాన్ గ్రూప్కు చెందిన వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్, మరో ఇద్దరు కలిసి న్యూపవర్ రెన్యువబుల్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఐసీఐసీఐ నుంచి రూ.3250 కోట్ల రుణం అందుకున్న ఆరు నెలలకే నూపవర్లోని రూ.64 కోట్ల విలువ చేసే షేర్లను ధూత్ కేవలం రూ.9 లక్షలకే దీపక్కు ఇచ్చేసి, ఆయనకే అన్ని బాధ్యతలను అప్పగించేశారు. ఈ విషయంలో చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్కు లబ్ది చేకూరేలా క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీచేసిట్టు ఆరోపణలు ఇటీవల తీవ్రతరం అవుతన్ను సంగతి తెలిసిందే.