Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.100 కోట్లతో ఏర్పాటుకు సర్కారుతో ఒప్పందం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఫ్రాన్స్కు చెందిన ఆహార, రుచికరమైన పానియాల తయారీ సంస్థ జార్జెస్ మోనిన్ తెలంగాణలో తమ తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ సర్కారుతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో తెలంగాణ సర్కారు అధికారులు, కంపెనీ ప్రతినిధులు ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి అవగాహన ఒప్పందాల్ని మార్చుకున్నారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో జార్జెస్ మోనిన్ సంస్థ తెలంగాణలో ప్లాంట్ను ఏర్పాటు చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. పండ్లు, కూరగాయలు, పుష్పాలు, గింజల నుంచి విభిన్న రకాల పానియాలను, సిరప్లను తయారు చేయడంలో 106 ఏండ్ల అనుభవం కలిగి ఉన్న జార్జెస్ మోనిన్ మన రాష్ట్రంలోనూ ఆయా ఉత్పత్తులను తయారు చేయనుంది. ఈ సంస్థ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్లాంట్ వల్ల దాదాపు 200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు కంపెనీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచడం, వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఫుడ్ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టుగా తెలిపారు. ఫ్రాన్స్ సంస్థకు తమ పూర్తి సహకారం అందించనున్నట్టుగా వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి జయేష్ రంజన్, జార్జెస్ మోనిన్ సంస్థ అధ్యక్షుడు వొలివియర్ మోనిన్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.