Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో వెలుగు చూస్తోన్న మోసాలను నియంత్రించేందుకు గాను అవసరమైతే భారతీయ రిజర్వు బ్యాంక్కు (ఆర్బీఐ) మరిన్ని అధికారులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. మంగళవారం ఆయన 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంకుల్లో మోసాలను గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు పీయూష్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో (పీఎన్బీ) వెలుగు చూసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ లాంటా మోసాలను నియంత్రించేందుకు అవసరమైతే ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కల్పిస్తామన్నారు. ఆర్బీఐకి చాలినన్ని అధికారులు అందుబాటులో ఉన్నాయని తాము భావిస్తున్నామని.. ఒకవేళ ఇంకా ఏవైనా అధికారాలు కావాలంటే కల్పించేందుకు తమ సర్కారు సిద్ధమేనని తెలిపారు. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టనున్నట్టుగా మంత్రి తెలిపారు. ఇటీవల ఆర్థిక వ్యవహారాల పార్లమెంట్ స్థాయిసంఘం ముందు హాజరైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ బ్యాంకుల్లో మోసాలను అరికట్టేందుకు తగిన అధికారాలు తమకు లేవంటూ పార్లమెంట్ సభ్యులకు ముందు తన గోడును వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన సీఈవోలు, చైర్మెన్లు, డైరెక్టర్లను తప్పించేందుకు, సాధారణ డైరెక్టర్లపై ఆంక్షలను అమలు చేసేందుకు ఆర్బీఐ వద్ద సరైన అధికారాలు లేవని స్థాయి సంఘానికి వెల్లడించారు. ఈ నేపథ్యంలో పీయూష్ తాజా ప్రకటన చేయడం విశేషం. తన వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఆర్బీఐకి చాలినని అధికారాలున్నాయని భావిస్తున్నానని.. మరిన్ని అధికారల కోసం ఆర్బీఐ వర్గాలతో చర్చించి తగిన చర్యలు చేపడుతామని వివరించారు. ప్రయివేటు రంగ బ్యాంకులు మోసాల కోసం ప్రభుత్వ బ్యాంకులను పావుగా వాడుకున్నాయని మంత్రి ఆరోపించారు.