Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభావం చూపిన ప్రపంచ పరిణామాలు
ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం లాభనష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడి చివరకు మదుపరులకు నష్టాలనే మిగిల్చాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ఆ తరువాత మొదలైన ఐరోపా మార్కెట్లు నష్టాల్లోకి జారడం, ప్రపంచ ప్రతికూలతల నేపథ్యంలో క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యమధ్యన కొంత కొలుకున్నట్టుగా కనిపించినా.. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు కొద్ది సేపటికే లాభాలను కోల్పోయాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 100 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్, చివరికి అమ్మకాల ఒత్తిడితో 115 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో బీఎస్ఈ సూచీ 35,432 పాయింట్లకు దిగజారింది. నిఫ్టీ సైతం 31 పాయింట్ల మేర నష్టాల్లోకి జారి 10,741 పాయింట్ల వద్ద స్థిరపడింది. గురువారం ట్రేడింగ్లో ఎక్కువగా ప్రభుత్వ రంగ బ్యాంక్లు నష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ సుమారు 2 శాతం మేర జారాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధంలో తాజా పరిణామాలు, ఒపెక్ దేశాల సమావేశం నుంచి ఎలాంటి నిర్ణయం వినవస్తుందోనన్న ఆసక్తికర ఎదురుచూపులు, ఈసీబీ కీలక రేట్ట నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు జాగురుకతతో భారీగా స్టాక్స్ విక్రయాలకు పాల్పడ్డారని దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు1.47%, రిలయన్స్ 1.22%, హెచ్డీఎఫ్సీ 0.35 శాతం, టాటా మోటార్స్ 0.31 శాతం, ఇన్ఫోసిస్ 0.24 శాతం, అదానీ పోర్ట్సు 0.23 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఎంఅండ్ఎం 2.11 శాతం, ఓఎన్జీసీ 1.90 శాతం, పవర్ గ్రిడ్ 1.88 శాతం, ఎస్బీఐఎన్ 1.67 శాతం, సన్ ఫార్మా 1.67 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.39 శాతం చొప్పున అధిక నష్టాల పాలైయ్యాయి. రంగాల వారిగా కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.47 శాతం, ఐటీ 0.32 శాతం, టెక్ 0.21 శాతం చొప్పున పెరిగాయి. ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. చైనా షాంఘై కాంపొజిట్, హాంకాంగ్ హాంగ్సెంగ్, దక్షిణ కొరియా కొస్పిలు నష్టాల్లో ముగియగా.. జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 1 శాతం వరకు పెరిగాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలహీనపడి 68.12 వద్ద తచ్చాడింది.