Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండంకెల వృద్ధిని సాధిస్తాం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటును రెండంకెలకు స్థాయికి తీసుకుపోవడమే లక్ష్యంగా తమ సర్కారు పని చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మేటి వృద్ధి రేటుతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యంలో భారత వాటాను రెట్టింపు చేసే విధంగా తాము కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వాణిజ్య మంత్రిత్వశాఖకొత్త కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో దేశంలో వ్యాపారానుకూల వాతావరణాన్ని సృష్టించామని తెలిపారు. కరెంటు ఖాతా లోటును అదుపులో ఉంచామని ఆయన వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంత్సరానికి గాను 7.7శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించామని తెలిపారు. అయితే కొన్ని ఏండ్లుగా 7-8 శాతం దరిదాపుల్లోనే వృద్ధి నమోదు అవుతుండడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక రానున్న రోజుల్లో రెండంకెల వృద్ధిని సాధించడమే లక్ష్యమని తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎప్పుడు అవతరిస్తుందా అని ప్రపంచం మనవైపు చూస్తోందని అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను రెట్టింపు చేయడమే కేంద్రం లక్ష్యమన్నారు.
మా ప్రభుత్వం మత్తు వదిలించింది..
దేశీయ తయారీ రంగాన్ని పెంచడం ద్వారా దిగుమతుల మీద ఒత్తిడి తగ్గుందని తెలిపారు. పనిని ఆలస్యం చేసే సంస్క తి నుంచి భారత్ దూరంగా జరిగిందని, అదే తమ ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. జులై 1 నుంచి జీఎస్టీ అందుబాటులోకి రావడం వల్ల వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పడటంతో పాటు, పన్నుల పరిధి కూడా పెరిగిందని ప్రధాని వివరించారు. జీఎస్టీ కింద కొత్తగా 54 లక్షల మంది పన్ను చెల్లింపు దారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ నాలుగేళ్ల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి పెద్ద ఎత్తున రావడంతోపాటు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో పెరిగాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.