Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తపన్నుతో అసలు లక్ష్యం నెరవేర లేదు..
- ఏడాది కావొస్తున్న నిలదొక్కుకోలేదు..
- సమస్యల వల్లే నగదుకు డిమాండ్: హెచ్ఎస్బీసీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఒకే జాతి- ఒకే పన్ను అన్న నినాదంతో మోడీ సర్కారు కొత్తగా అమలులోకి తీసుకు వచ్చిన 'వస్తుసేవల పన్ను' (జీఎస్టీ) అసలు లక్ష్యాన్ని అందుకోలేకపోయిందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ హెచ్ఎస్బీసీ ఒక నివేదికలో వెల్లడించింది. కొత్త పన్ను విధానం అమలులోకి తేవడం వల్ల ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతందని సర్కారు భావించిందని.. అయితే జీఎస్టీ అమలులోకి వచ్చి ఏడాది కావొస్తున్నా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక పోయిందని ఆ నివేదిక అభిప్రాయపడింది. ఇదే సమయంలో సర్కారు భావించినట్టుగా జీఎస్టీ వల్ల వ్యవస్థలో నగదు చెలామణి కూడా తగ్గకపోగా.. మరింతగా పెరిగిందని విశ్లేషించింది. గత ఏడాది జులై 1వ తేది నుంచి జీఎస్టీ పన్ను విధానాన్ని మోడీ సర్కారు ఆగమేఘాలపై అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.. ఆ తరువాత ఈ పన్ను విధానంలో పలు సంవరణలను తీసుకువచ్చారు. పలు వస్తుసేవలపై పన్ను రేట్లను తగ్గించడం, వివిధ వస్తువులపై సెస్లు, లేవీ రేట్లను పెంచడం వంటి చర్యలను సర్కారు చేపట్టిందని హెచ్ఎస్బీసీ తన నివేదిక వివరించింది. సాంకేతిక కారణాలు నెట్వర్క్ సమస్యలు, సకాలంలో పన్ను రిఫండ్స్ జరగకపోవడం, సేవలపై అధిక పన్నుల భారాన్ని మోపడం తదితరాల సమస్యల వల్ల వ్యవస్థలో నగదుకు డిమాండ్ మరింతగా పెరిగిందని ఈ నివేదికలో హెచ్ఎస్బీసీ విశ్లేషించింది. ఏప్రిల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు కారణంగా కొత్తగా దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్రమబద్ధీకరణ దిశగా సాగుతోందని పేర్కొన్నారు. కోటి మంది ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చి చేరడం ఇందుకు నిదర్శనమని ఆయన వివరించారు. అయితే సర్కారు చెబుతున్నట్టుగా జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా అలాంటిదేమీ జరగడం లేదని తాజా నివేదిక తేటతెల్లం చేసింది. కార్పొరేట్ అమ్మకాల గణాంకాలను ఉదహరిస్తూ ఆర్థిక వ్యవస్థ క్రమబద్దీకరణ తిరిగి నోట్ల రద్దునాటి ముందు స్థాయికి దిగజారిందని నివేదిక తెలిపింది.
గ్రామీణ వ్యవస్థలో ప్రతికూలత..
వ్యవస్థలో నగదు డిమాండ్ పెరగడానికి సాధారణంగా గ్రామీణ వేతనాలు (కూలీ) ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తాయని.. అయితే పరిస్థితి ఇప్పుడు మారిపోయిందని నివేదిక పేర్కొంది. దేశంలో 70 శాతం గ్రామీణ భారతం ప్రధాన ఆదాయం కూలీయేనని.. ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల వల్ల గ్రామీణ భారతం నుంచి నగదుకు డిమాండ్ లభించడం లేదని నివేదిక పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం, నిర్మాణ రంగంలో బలమైన వృద్ధి, సాధారణ వర్షపాతం, కనీస మద్దతు ధర పెరగడం వ్యవస్థలో నగదు చెలామణిపై ఒత్తిడి పెంచే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. అయితే దీర్ఘకాలంలో జీఎస్టీ వ్యవస్థలో లోపాలను సరిచేస్తూ ముందుకు వెలితే దేశ ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ పుష్కలంగా అవకాశాలు ఉన్నట్టుగా నివేదిక తెలిపింది.