Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పడిపోయిన పీఎస్బీల డివిడెండ్
- 21లో రెండు బ్యాంకులే చెల్లించే అవకాశం
- సర్కారు ఖజానాకు తగ్గనున్న రాబడి...
- సంక్షేమ నిధులకు కోతపడే అవకాశం..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగి వాటి మనుగడ కష్టతరమవుతున్న నేపథ్యంలో.. సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని మొత్తం 21 బ్యాంకుల్లో దాదాపు 19 బ్యాంకులు నిరర్థక ఆస్తులు, మొండి బాకీల బెడదను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా బ్యాంకులు కేటాయింపుల నిమిత్తం లాభాల్లో అధిక భాగాన్ని తరలించడంతో ఇప్పుడు సదరు బ్యాంకుల నుంచి సర్కారుకు డివిడెండ్ల రూపంలో రావాల్సి రొక్కానికి దాదాపుగా గండి పడినట్టయింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2018) గాను కేవలం ఆర్థికంగా బలమైన బ్యాలెన్స్షిట్తో ముందుకు సాగుతున్న ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్లు మాత్రమే డివిడెండ్లు చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషణ సంస్థలు చెబుతున్నాయి. ఈ రెండు బ్యాంకులు కలిసి 2018 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.444 కోట్లు మాత్రమే డివిడెండ్ రూపంలో సర్కారు చెల్లించే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా దాదాపు 19 బ్యాంకులు ఈ సారి సర్కారు రిక్తహస్తమే అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఏడాది రూ.2109 కోట్లు..
గత ఏడాది (2017 ఆర్థిక సంవత్సరంలో) నాలుగు సర్కారీ బ్యాంకులు తమ లాభాల్లో వాటాను డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. ఎస్బీఐ (రూ.2109 కోట్లు), ఇండియన్ బ్యాంక్ (రూ.288 కోట్లు), విజయ బ్యాంక్ (రూ.150 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.333 కోట్లు) కలిసి ఆ ఏడాదిలో మొత్తం రూ.2879 కోట్ల మేర డివిడెండ్ను సర్కారుకు చెల్లించాయి. 2013 ఆర్థిక సంవత్సరం వరకు పెరుగుతూ వచ్చిన పీఎస్బీల డివిడెండ్ చెల్లింపులు.. 2015 నుంచి క్రమంగా దిగజారుతూ వచ్చాయి. 2009 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన సబ్ప్రైమ్ కారణంగా బ్యాంకులు అతితక్కువ మొత్తంలో డివిడెండ్లు చెల్లించిన తరువాత మళ్లీ ఇంత కనిష్ట స్థాయిలో సర్కారు బ్యాంకుల డివిడెండ్లు నమోదు కానుండడం ఇదే తొలిసారి. 2015లో సర్కారు బ్యాంకులన్ని కలిసి గరిష్టగా దాదాపు రూ.6940 కోట్ల మేర డివిడెండ్ను ప్రకటించడం విశేషం. మూడేండ్లు కూడా తిరక్క ముందే ఈ మొత్తం మూడంకెల స్థాయికి పడిపోవడం విశేషం. ఈ నేపథ్యంలో సర్కారు ఆదాయం తగ్గి సంక్షేమ పథకాలకు కోత పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.