Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 'టర్బో మెఘా ఎయిర్వేస్'కు చెందిన ట్రూజెట్ ఎయిర్లైన్స్ భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. 2019 మార్చి ముగింపు నాటికి కొత్తగా మరో 20 నగరాలకు తమ సేవలను విస్తరించనున్నట్టుగా తెలిపింది. ఆ కంపెనీ నాలుగో యేడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రూజెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) విశోక్ మాన్సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 14 ప్రాంతాలకు ట్రూజెట్ విమాన సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనికి అదనంగా వచ్చే మార్చి నాటికి మరో 07 కొత్త ఎయిర్క్రాప్టులను జోడించనున్నామని వెల్లడించారు. ఇందుకోసం ఏటీఆర్-72ఎస్లను లీజుకు తీసుకోనున్నామని వివరించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాల రీజినల్ కనెక్టివిటీ సేవల్లో భాగంగా తాము భాగస్వామ్యం అవుతున్నామన్నారు. వచ్చే కొద్ది నెలల్లోనే పశ్చిమ, ఈశాన్య రీజియన్లలోని కొత్త ప్రాంతాలకు విస్తరించనున్నామని తెలిపారు. ఇందులో అహ్మాదాబాద్, కాండ్లా, పోర్బందర్, కేషోడ్, జైసల్మెర్, జలగావ్, నాసిక్, గౌహతి తదితర ముఖ్య నగరాలు ఉన్నాయన్నారు. కొత్తగా ఏడు ఎయిర్క్రాప్టులను జోడించుకోవడం ద్వారా ఈ కేంద్రాలకు విస్తరించనున్నామని ట్రూజెట్ చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్ (సీఎఫ్వో) విశ్వనాథ్ పేర్కొన్నారు. ఆర్థికంగా తాము స్థిరంగానే ఉన్నామన్నారు. లాభాలకు చేరువలో ఉన్నామని తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో 12 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చామని తెలిపారు. వచ్చే దశ విస్తరణలో మరింత వృద్ధి సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.