Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐ/ఎంఎల్ల తో డేటా తస్కరణ యత్నాలు
- యూఐడీఏఐ చైర్మెన్ జె. సత్యనారాయణ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో పలు పథకాలకు ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు మెరుగ్గా చేరువవు తున్నాయని విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మెన్ జె.సత్యనా రాయణ అన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో 'డిజిటల్ ఐడెంటిటీ రీసెర్చ్ ఇన్షియేటివ్ (డీఐఆర్ఐ)' ఆధ్వర్యంలో 'డిజిటల్ గుర్తింపు'పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. వివిధ సంక్షేమ పథకాలను ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వానికి మార్చి 2018 నాటికి దాదాపు రూ.90,012 కోట్ల నిధుల మిగులు లభించినట్టుగా ఆయన తెలిపారు. బోగస్, నకిలీ లబ్దిదారులను అరికట్టేందుకు ఈ విశిష్ఠ సంఖ్యను ఉపయోగించుకోవడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. దేశంలో జులై 10నాటికి 121కోట్లకు పైగా ఆధార్ కార్డులు జారీ అయ్యాయని. రోజూ 3 కోట్ల మంది వివిధ ఎలక్ట్రానిక్ లావాదేవీలకు దీన్ని వాడుతున్నారు. లక్ష మంది వరకూ రోజూ ఆధార్ నమోదు చేసుకుంటున్నారు'అని తెలిపారు. అయితే మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్నవారిని, జనజీవన స్రవంతికి దూరంగా ఉన్న వారిని ఆధార్ పరిధిలోకి తీసుకురా వడానికి ఇబ్బందుల ఎదురవు తున్నాయని ఆయన వివరించారు. టెక్నాలజీ రంగంలో సంచలనంగా దూసుకు వస్తున్న కృత్త్రిమ మేథస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి వాటితో డేటాను తస్కరిస్తూ ఆధార్ భద్రతకు ముప్పు తెచ్చే ప్రయత్నాలు జరగొచ్చని.. వీటి నుంచి ఆధార్కు మరింత భద్రత తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జరగాల్సి ఉందని ఆయన పరిశోధకులకు సూచించారు. ఆధార్ సమాచారం విషయంలో ఎలాంటి ఆందోళనా అక్కర్లేదనీ, ఇది అత్యంత సురక్షితమని పేర్కొన్నారు. ఆధార్ బయోమెట్రిక్ ఉపయోగించాలంటే యూఐడీఏఐ ద్వారా ధ్రువీకరించిన పరికరాలు, వ్యక్తులకే సాధ్యమన్నారు. దీన్ని ఉపయోగించి ఎవరైనా మోసానికి పాల్పడితే వెంటనే గుర్తించేందుకు వీలుందని తెలిపారు.
ఓటరు కార్డుతో అనుసంధానంపై చెప్పలేను..
పలు సంక్షేమ పథకాలకు ఆధార్ను అనుసంధానం చేస్తున్న ప్రభుత్వం ఓటరు కార్డును ఆధార్తో ఎందుకు అనుసంధానం చేయడం లేదంటూ ఐఐటీ, ఐఐఎంలకు చెందిన పరిశోధకులు అడిగిన ప్రశ్నకు సత్యనారాయణ సమాధానం ఇస్తూ ఇది ఎన్నికల కమిషన్ ప్రభుత్వంతో కలిసి తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయమని దాని గురించి తాను మాట్లాడలేనని వెల్లడించారు.