Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ త్రైమాసికానికి 3.7% పెరిగిన లాభం
- ఒక్కో ఏడీఎస్కు బోనస్గా మరో ఏడీఎస్ ప్రకటించిన కంపెనీ
- ఈ ఏడాది 13,000 కోట్ల తిరిగి చెల్లింపులు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ జూన్తో ముగిసిన త్రైమాసికానికి మదుపరులను మురిపించే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య మూడు నెలల కాలానికి ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం 3.7 శాతం మేర పెరిగి రూ.3,483 కోట్ల నుంచి రూ.3,612 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. మొదటి త్రైమాసికం కాలంలో సంస్థ ఆదాయం 12 శాతం మేర పెరిగి రూ.17,078 కోట్ల నుంచి రూ.19,128 కోట్లకు చేరుకుందని సంస్థ తెలిపింది. మేటి ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ బోర్డు వాటాదారులకు శుభవార్తను వెల్లడించింది. వాటాదారుల వద్ద ఉన్న ప్రతీ షేరుకు మరో షేరును బోనస్గా అందించనున్నట్టుగా కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థలకు తెలిపింది. దీనికి తోడు ప్రతీ ఒక్క అమెరికన్ డిపాజిటరీ షేరుకు (ఏడీఎస్) అదనంగా మరో ఏడీఎస్ను కేటాయించనున్నట్టుగా కూడా కంపెనీ వివరించింది. 2019 స్థిర కరెన్సీ ప్రాతిపదికన సంస్థ ఆదాయం 6-8 శాతం రెవెన్యూ గ్రోత్ అవుట్లుక్ను ప్రకటించింది. డిజిటల్తో పాటు కృత్త్రిమ మేథస్సు రంగాలపై తమ ఖాతాదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించేందుకు వీలు పడిందని ఇన్ఫోసిస్ సంస్థ సీఈవో, ఎండీ సలీల్ పారేఖ్ తెలిపారు. వాటాదారులు కోరుకుంటున్నట్టుగా అధిక రాబడి వచ్చేలా తమ సంస్థ మార్చి నాటికి దాదాపు రూ.13,000 కోట్ల మేర చెల్లింపులను వివిధ రూపాల్లో వాటాదారులకు అందించునున్నట్టుగా ప్రకటించారు. ఇందులో రూ.2,600 కోట్ల ప్రత్యేక డివిడెండ్ కూడా ఉండనుందని అన్నారు. తమ సంస్థలో అదనంగా ఉన్న నగదు నిల్వల్లో దాదాపు 70 శాతాన్ని తిరిగి వాటాదారులకే అందించలన్న లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నట్టుగా సంస్థ తెలిపింది. మార్కెట్లు ముగిశాక ఇన్ఫోసిస్ సంస్థ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్లు 1.12 శాతం మేర పెరిగి రూ.1,309.10 వద్ద ముగిశాయి. జూన్తో ముగిసిన ఈ క్వార్టర్లో బేసిక్ ఈపీఎస్ 16.62 రూపాయలుగా ఉందని ఇన్ఫోసిస్ తెలిపింది. స్థిరమైన కరెన్సీ విలువల్లో 2019 ఆర్థిక సంవత్సరపు రెవెన్యూ గైడెన్స్ 6 శాతం నుంచి 8 శాతం మధ్యలోనే ఉంచింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ను కూడా 22 శాతం నుంచి 24 శాతంగానే నిర్ణయించింది.
మొత్తం రెవెన్యూల్లో డిజిటల్ రెవెన్యూలు 28.4 శాతంగా 803 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ తన ఫలితాల్లో వెల్లడించింది. ప్రస్తుతం పనాయా కోసం జరుగుతున్న చర్చలు తమ లాభాలపై ప్రభావం చూపాయని ఇన్ఫోసిస్ చెప్పింది. గత క్వార్టర్లో ఈ ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ కంపెనీని చెందిన పలు ఆస్తులను కంపెనీ అమ్మకానికి ఉంచింది. అమ్మకానికి ఉంచిన ఆ ఆస్తుల ఫెయిర్ వాల్యును కంపెనీ తగ్గించడంతో, ఈ ప్రభావం నికర లాభాలపై చూపిందని ఇన్ఫోసిస్ పేర్కొంది.