Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అరబిందో ఫార్మా సంస్థ ఐరోపాకు చెందిన ప్రముఖ జెనరిక్ ఔషధ తయారీ సంస్థ అపోటెక్స్ వ్యాపారాలను కొనుగోలు చేయనుంది. పోలాండ్, చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్, స్పెయిన్, బెల్జియంలలో వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు గాను అరబిందో సంస్థ అపోటెక్స్తో ఒక నిర్ధిష్టమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 7.4 కోట్ల యూరోలు. ఈ మొత్తం వ్యవహారం నగదు రూపంలోనే జరగనుందని అరబిందో ఫార్మా తెలిపింది. తాజా కొనుగోలు మూలంగా అపోటెక్స్ సంస్థకు చెందిన దాదాపు 200 నిర్ధేశిత ఔషధాలు, 88 ఓటీసీ ఉత్పత్తులతో పాటు అదనంగా 20 కొత్త ఉత్పత్తులు అరబిందో సొంతం కానున్నాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఐరోపా సంస్థ నికర అమ్మకాలు 13.3 మిలియన్ యూరోలుగా ఉంది. తాజా కోనుగోలుకు సంస్థలోని రుణ ప్రతిపాదనకు ఎలాంటి సంబంధం లేదని సంస్థ తెలిపింది. ఒప్పందంలో భాగంగా అరబిందో ఐరో పాలోని అపోటెక్స్ సంస్థకు చెందిన వాణిజ్య కార్యక లాపాలను, సంబంధింత తోడ్పాటును అందించే మౌలిక వసతులు అరబిందో సొంతం కానున్నాయి. ఐరోపాలోని వివిధ విభాగాలకు తమ సంస్థను విస్తరించాలన్న కంపెనీ వ్యూహంలో భాగంగానే తాము అపోటెక్స్ను కొనుగోలు చేస్తున్నట్టుగా అరబిందో ఫార్మా ఐరోపా కార్యకలాపాల పర్యవేక్షక వైస్ ప్రెసిడెంట్ వి. మురళీధరన్ తెలిపారు. తాజా కొనుగోలుతో నెదర్లాండ్స్లో ఓటీసీ మెడిసిన్స్తో పాటు వివిధ ఉత్పత్తులను విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఫలితంగా తూర్పు ఐరోపాలో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకొనే అవకాశం ఏర్పడనుందని ఆయన అన్నారు.