Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లకు ధరల సెగ తగిలింది. ప్రస్తుత ఏడాది జూన్లో టోకు ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా నాలుగున్నరేళ్ల గరిష్ట స్థాయికి చేరడం మార్కెట్లను ఒత్తిడికి గురి చేసింది. మరోవైపు దేశ వాణిజ్య లోటు 43 మాసాల గరిష్ట స్థాయికి ఎగియడం, అంతర్జాతీయ బలహీన అంశాలు తదితర పరిణామాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీంతో ఇంధన, రియాల్టీ, వైద్య సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురైయ్యాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం బిఎస్ఇ సెన్సెక్స్ 217.86 పాయింట్లు లేదా 0.6 శాతం పతనమై 36,323.77కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 82.05 పాయింట్లు లేదా 0.74 శాతం క్షీణించి 10,936.85కు దిగజారింది.
సెన్సెక్స్-30లో కేవలం 10 స్టాక్స్ లాభపడగా, 19 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కొగా, మరో స్టాక్ యథాతథంగా నమోదయ్యింది. ఇందులో టాటా స్టీల్ 6.96 శాతం, టాటా మోటార్స్ 4.77 శాతం, సన్ ఫార్మా 4.69 శాతం, భారతీ ఎయిర్టెల్ 3.31 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.26 శాతం, అదానీ పోర్ట్సు 2.69 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. మరోవైపు ఎన్టీపీసీ 1.96 శాతం, ఇన్ఫోసిస్ 1.83 శాతం, హెచ్డీఎఫ్సీ 0.95 శాతం, విప్రో 0.86 శాతం, హెచ్యుఎల్ 0.73 శాతం, యెస్ బ్యాంకు 0.69 శాతం చొప్పున అధికంగా పెరిగిన వాటిలో టాప్లో ఉన్నాయి.
'చిన్న'బోయిన సూచీలు
స్టాక్ మార్కెట్లలో మధ్య, చిన్న స్థాయి సూచీలు తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. సోమవారం ఇంట్రా ట్రేడింగ్లో మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం మేర విలువ కోల్పోయాయి. మిడ్క్యాప్ 2017 ఆగస్టు 23 నాటి, స్మాల్ క్యాప్ 2017 ఆగస్టు 30 నాటి కనిష్ట స్థాయికి దిగజారాయి. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 15 శాతం, 18 శాతం చొప్పున నష్టపోయాయి. ఇదే సమయంలో బిఎస్ఇ స్థూలంగా 7 శాతం పెరిగింది. మిడ్, స్మాల్ క్యాప్లోని 142 స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయి వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. ఇందులో అబాన్ అఫ్షోర్, బీఈఎంఎల్, సెంచూరీ టెక్స్టైల్స్, జెట్ ఎయిర్వేస్, పీసీ జ్యువెల్లర్స్, టాటా పవర్ కంపెనీలున్నాయి. మరో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులది ఇదే స్థితి. ఆంధ్రా బ్యాంకు, ఓబీసీ కెనరా బ్యాంకు, దేనా బ్యాంకు తదితర విత్త సంస్థలు అమ్మకాల ఒత్తిడిలో కొనసాగుతున్నాయి.
ప్రతికూల పరిణామాలు..
ప్రస్తుత ఏడాది జూన్లో కూరగాయలు, ఇంధన ధరలు పెరగడంతో టోకు ద్రవ్యోల్బణం సూచీ 5.77 శాతానికి ఎగిసింది. ఇంతక్రితం మేలో డబ్ల్యుపిఐ 4.43 శాతంగా చోటు చేసుకుంది. క్రితం జూన్లో అహారోత్పత్తుల ధరలు 1.80 శాతం పెరిగాయని కేంద్ర గణంకాల శాఖ వెల్లడించడంలో మదుపర్లు మార్కెట్లపై విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రస్తుత ఏడాది జూన్లో భారత వాణిజ్య లోటు 16.60 బిలియన్ డాలర్లకు ఎగిసి 43 నెలల గరిష్ట స్థాయికి చేరింది. గతేడాది ఇదే మాసంలో 12.96 బిలియన్ డాలర్ల లోటు చేసుకుంది. అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య టారీఫ్ యుద్ధం భారత వాణిజ్య లోటును మరింత పెంచనుందన్న అంచనాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. నిఫ్టీలో రంగాల వారిగా రియాల్టీ 3.32 శాతం, ఫార్మా 4.12 శాతం, లోహ 3.61 శాతం, ఆటో 1.53 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి.