Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కష్టాల్లో ఉన్న బ్యాంకులకు మూలధన సాయం
- ఆంధ్రా బ్యాంకు 2,019 కోట్లు
- పరుగులు పెట్టిన పీఎస్బీల స్టాక్లు
ముంబయి: నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) బెడదకు ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకొనేందుకు గాను సర్కారు ముందుకు వచ్చింది. అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) దాదాపు రూ.11,336 కోట్ల మేర మూలధనం సాయం అందించడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్లు కూడా ఉన్నాయి. పీఎస్బీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి మూలధన కేటాయింపులు. ఈ కేటాయింపుల్లో నీరవ్ మోడీ మోసంతో అత్యధికంగా నష్టపోయిన పీఎన్బీ గరిష్టంగా రూ.2,816 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ.1,790 కోట్లు, ఆంధ్రా బ్యాంకుకు రూ.2,019 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ.2,157 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.2,555 కోట్ల చొప్పున మూలధన సాయాన్ని సర్కారు సమకూర్చనుందని సమాచారం. ఈ బ్యాంకులు ప్రస్తుతం టైయర్-1 (ఏటీ-1) బాండు హోల్డర్లకు వడ్డీలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నాయి. తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న బ్యాంకులకు తొలుత మూలధనం అందించాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పీఎస్బీలు మార్కెట్ల నుంచి రూ.50,000 కోట్లు సమీకరించడానికి ప్రణాళికలు రూపొందించుకున్న సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్లో స్టాక్స్ సందడి..
పీఎస్బీలకు కేంద్రం మూలధనం సమకూర్చనుందన్న అంచనాల్లో మంగళవారం పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాలు నమోదు చేశాయి. బ్యాంకు స్టాక్స్ 11 శాతం వరకు ర్యాలీ చేశాయి. కార్పొరేషన్ బ్యాంకు 10.88 శాతం, అలహాబాద్ బ్యాంకు 7.23 శాతం, పీఎన్బీ 6.57 శాతం, బీఓబీ6.38 శాతం, బీవోఐ 5.87 శాతం, కెనరా బ్యాంకు 5.71 శాతం, ఇండియన్ బ్యాంకు 5.04 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆంధ్రా బ్యాంకు 4.91 శాతం, దెనా బ్యాంకు 3.58 శాతం, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా 3.10 శాతం, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర 2.27 శాతం, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు 1.35 శాతం చొప్పున ర్యాలీని నమోదు చేశాయి.