Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభావం చూపుతున్న రూపాయి పతనం
- ధరలు పెంచే యోచనలో సెల్ ఫోన్ల తయారీదారులు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
మొబైల్ ఫోన్ల ధరలు మళ్లీ కొండెక్కె సంకేతాలు కనిపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల వల్ల డాలర్తో రూపాయి మారకం విలువ అంతకంతకు పడిపోతోంది. తాజాగా రూపాయి రికార్డు స్థాయిలో రూ.70 స్థాయికి పడిపోయింది ఆ ప్రభావం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్పై తీవ్రంగా పడనుంది. రూపీ దెబ్బతో దిగుమతి చేసుకుంటున్న మొబైల్ ఫోన్లు, వాటి ఉపకరణాల ధరలు 4-6 శాతం పెరగనున్నాయని అంచనా. వచ్చే సెప్టెంబర్ మధ్య నాటికి మొబైల్ ఫోన్ల ధరలు పెరుగొచ్చని ఆ రంగం పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొబైల్ ఫోన్లు, వాటి ఉపకరణాలు విక్రయించే విదేశీ కంపెనీలకు మాత్రం భారీ ఆదాయం సమకూరనుంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో మంగళవారం డాలర్తో రూపాయి విలువ 69.80 వద్ద ముగిసింది. ఇంట్రా ట్రేడింగ్లో ఏకంగా 70 మార్క్ను చేరింది. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు రూపాయి విలువ 7 శాతం క్షీణించింది. కొన్ని బ్రాండుల కంపెనీలు భారత్లో మొబైల్ ఫోన్లలో కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్సు (పీసీబీ)లను తయారు చేస్తున్నాయి. కానీ చాలా వరకు కంపెనీలు ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందులో అత్యధికంగా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. అందులోనూ రూ.20,000 దిగువన ఉన్న మొబైళ్లపై ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.
6-8 శాతం పెరుగొచ్చు..
రూపాయి విలువ 70కి పడిపోవడంతో ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడనుందని ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మెన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. దీంతో ఆయా ఉత్పత్తులపై పరిశ్రమ ధరలు పెంచాల్సిన పరిస్థితి చోటు చేసుకుందన్నారు. డాలర్తో రూపాయి సగటు విలువ 64-66తో పోల్చితే మొబైల్ ఫోన్ల ధరలు 6-8 శాతం పెరుగొచ్చని అంచనా వేశారు. రూపాయి విలువ మరింత పడిపోతే వచ్చే పండుగ సీజన్లో కొత్త ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయని పానాసోనిక్ మొబిలిటీ హెడ్ పంకజ్ రానా పేర్కొన్నారు. విక్రయస్తులకు ఆగస్టు, అక్టోబర్ మాసాలు అత్యంత కీలకమని ఐడీసీ ఇండియా క్లయింట్ డివైసెస్ అసోసియేట్ రీసెర్చ్ డైరెక్టర్ నవ్కెండర్ సింగ్ పేర్కొన్నారు. కంపెనీల మొత్తం రెవెన్యూలో మూడో వంతు ఈ పండుగ సీజన్లోనే సమకూరనుందన్నారు. ఇందుకోసం గత రెండు, మూడు నెలల నుంచే ఆర్డర్లు ఉంటాయని, ఆగస్టు, సెప్టెంబర్లోనే వీటి సరఫరా పూర్తి కానుందన్నారు. అయితే వచ్చే నెలలో ధరలు కొంత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పండుగ సీజన్లో ప్రీమియం ఫోన్ల ధరలు మరింత పెరుగొచ్చని ఇండిస్టీ ఇంటిలిజెన్సీ గ్రూపు (ఐఐజీ) విశ్లేషిస్తోంది.