Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కుటుంబాల ఆధీనంలో నిర్వహించబుడుతున్న వారసత్వ వ్యాపారాలు భారత్లో విస్తృతంగా వ్యాపిస్తున్నాయని ప్రముఖ ప్రపంచ ఆర్థిక రేటింగ్ సంస్థ క్రెడిట్ సూయిస్ వెల్లడించింది. అత్యధికంగా కుటుంబ వ్యాపారాలు కలిగిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టుగా ఆ సంస్థ వెల్లడించింది. భారత్లో మొత్తం 111 బడా కుటుంబ వ్యాపార సంస్థలు వారసత్వంగా తమ విస్తృతిని చాటుకుంటున్నాయని వివరించింది. వీటి మొత్తం మార్కెట్ విలువ 839 బిలియన్ డాలర్లుగా నమోదు అయినట్టుగా క్రెడిట్ సూయిస్ వివరించింది. 'క్రెడిట్ సూయిస్ ఫ్యామిలీ 1000 ఇన్ 2018' పేరుతో క్రెడిట్ సూయిస్ పరిశోధన సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని మొత్తం 7000 కుటుంబ వ్యాపార సంస్థల సమాచారాన్ని విశ్లేషించి ఈ సంస్థ ఒక జాబితాను ప్రకటించింది. దీని ప్రకారం.. 159 కంపెనీలతో కుటుంబ వ్యాపారాలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో చైనా ప్రథమ స్థానంలో నిలవగా.. ఇక రెండో స్థానంలో అమెరికా నిలిచింది. ఆ దేశంలో 121 కంపెనీలను ఆయా వ్యవస్థాపకుల వారసులు కొనసాగిస్తున్నారు. ఇక ఈ జాబితాలో ఎక్కువ కంపెనీలు ఆసియా ప్రాంతానికి చెందినవే. చైనా, భారత్, హాంకాంగ్ ఇందులో ముందువరుసలో ఉన్నాయి. ఈ జాబితాలో 43 కంపెనీలతో దక్షిణకొరియా నాలుగో స్థానంలో నిలువగా.. 26 కంపెనీలతో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థారులాండ్ దేశాలు ఐదో స్థానాన్ని పంచుకున్నాయి. 'ఈ ఏడాది కుటుంబ వ్యాపారులు దూసుకెళ్తున్నాయి. ప్రాంతమేదైనా, ఏ రంగంలోనైనా, పెద్దదైనా, చిన్నదైనా కుటుంబ వ్యాపారాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నాయి' అని క్రెడిట్ సూయిసీ ప్రధాన విశ్లేషకులు ఎగెనే క్లెర్క్ తెలిపారు. భారత్లో కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు వాటాదారులకు అత్యధిక రిటర్నులు ఇచ్చినట్టుగా పేర్కొంది. 2006 నుంచి మొత్తం కుటుంబ వ్యాపార సంస్థలు వాటాదారులకు షేరు ధరపై 13.9% వార్షిక సగటు ఆదాయాన్ని ఆర్జించిపెట్టాయి. ఇదే సమయంలో వ్యష్టి కుంటుంబ సంస్థలు వాటాదారులకు షేరు ధరలపై కేవలం 6% వార్షిక సగటు ఆదాయాన్ని మాత్రమే ఆర్జించి పెట్టాయని సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. ఇక ఇలాంటి కంపెనీల్లో అత్యధిక లాభం ఆర్జించే టాప్ 50లో ఆసియాకు చెందిన 24 సంస్థలున్నాయని నివేదిక తెలిపింది.