Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఇటీవల జరిగిన కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల వారిని ఆదుకోవడంలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ తన అంకితభావాన్ని మరో మారు చాటుకుంది. ఈ నెల 11న కొండగట్టు వద్ద ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మరిణించిన కుటుంబాల వారికి బీమా క్లయిమ్లను అందించడంలో చాలా వేగంగా స్పందించి అందరి మన్ననలను అందుకొంది. ప్రమాదంలో మరణించిన వారిలో మొత్తం 13 మంది ఎల్ఐసీ బీమా పాలసీదారులు ఉన్నట్టుగా గుర్తించిన ఎల్ఐసీ తొలి విడుతగా వారిలో నలుగురు కుటుంబాలకు చెందిన నామినీలకు బీమా క్లయిమ్లను అందించింది. ఎల్ఐసీ కరీంనగర్ డివిజన్కు చెందిన సీనియర్ డివిజనల్ మేనేజర్ వై.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎల్ఐసీ అధికారుల బృందం కొండగట్టు సమీపంలోని తిరుమలాపురం, దబ్బుతిరుమలాపురంలోని బాధితుల కుటుంబాల వారికి ఈ క్లయిమ్ల పంపిణీ జరిపింది. ఈ సందర్భంగా ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ వై. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన ఖాతాదారులు కష్టంలో ఉంటే ఆదుకొనే క్రమంలో ఎల్ఐసీ ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రమాదం జరిగిన నాలుగు రోజలు వ్యవధిలోనే బాధిత కుటుంబాల వారికి క్లయిమ్ల చెల్లింపు జరిగినట్టుగా ఆయన వివరించారు. ప్రమాదంలో మరణించిన ఇతర కుటుంబాల వారు కూడా తమ వారికి సంబంధించిన జీవిత బీమా సర్టిఫికేట్లు గనుక ఉంటే వెంటనే తమను సంప్రదించాలని కోరారు. వారికి వీలైనంత త్వరలో క్లయిమ్ సెటిల్మెంట్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.