Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోటు పెరిగినా సర్కారు భయపడదు..
- ఆర్థిక వృద్ధికి వ్యయం ఎంతో ముఖ్యం
- పరిమితి లోపే ఈ ఏడాదిని ముగిస్తాం
- 'ఆర్థిక'ంపై ప్రధాని సంతృప్తి: ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: వివిధ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో దేశ 'కరెంటు ఖాతా లోటు' (సీఏడీ) ఆందోళనకర స్థాయికి పెరుగుతున్నప్పటికీ సర్కారు ఖర్చు తగ్గించుకొనే విషయంలో వెనక్కి తగ్గేది లేదని సర్కారు శనివారం తేల్చి చెప్పింది. ఈ విషయమై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం వివరణనిస్తూ బడ్జెటరీ వ్యయంలో ఎలాంటి కోత లేకుండానే ఈ ఆర్థిక సంవత్సరాన్ని ముగించనున్నట్టుగా వెల్లడించారు. ఖర్చు తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి విఘాతం కలుగొచ్చని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో తాము వ్యయాన్ని తగ్గించుకోవాలనుకోవడం లేదని వివరించారు. ఆగస్టు 31 నాటికి ప్రభుత్వం బడ్జెట్లో నిర్ధేశించుకున్న వ్యయంలో 44 శాతం ఖర్చు చేసినట్టుగా ఆయన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ - ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు గాను శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక శాఖ అంతర్గత సమావేశం అనంతరం జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సమావేశం వివరాలను వెల్లడిస్తూ ఆర్థిక వ్యవస్థ విస్తృత పారామితులను సమీక్షించిన ప్రధాని ఆయా శాఖలకు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిపారు. దీనికి తోడు ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సూక్ష్మ గణాంకాల పట్ల కూడా ప్రధాని సంతుష్టత వ్యక్తంచేసినట్టుగా తెలిపారు.
అంచనాలను మించి వృద్ధి ఉండొచ్చు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించుకున్న 3.3 శాతం ద్రవ్య లోటు పరిమితికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరం నిర్ధేశించుకున్నదాని కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించగలమన్న విశ్వాసాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. నల్లధనం నియంత్రణకు గాను తమ సర్కారు చేపట్టిన చర్యల కారణంగా మెరుగైన పన్న వసూళ్లు నమోదు అవుతున్నాయని జైట్లీ వివరించారు. దేశంలో జీఎస్టీ ఇప్పుడిప్పుడే కుదురుకుంటోందని ఆయన అన్నారు. వినిమయం పుంజుకోవడం ద్వారా జీఎస్టీ పన్ను వసూళ్లు పెరుగుతాయని ఆయన అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణపై జైట్లీ వివరణనిస్తూ గత ఏడాది మాదిరిగానే నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని దాటి డిజిన్వెష్ట్మెంట్ చేపట్టగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రణాశిక ప్రకారం ముందుకు పోనున్నట్టుగా ఆయన తెలిపారు.