Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ చేతులు మారింది. ప్రకటనల ఆదాయం తగ్గి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొం టున్న మెరెడిత్ కార్పొరేషన్కు చెందిన టైమ్ మ్యాగజైన్ను 190 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ. 1378.92 కోట్లు) విక్రయించినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ప్రముఖ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సేల్స్ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ బెనియాఫ్ దంపతులు టైమ్ మ్యాగజైన్ను కొనుగోలు చేశారని పేర్కొంది. అయితే మార్క్ బెనియాఫ్ వ్యక్తిగతంగానే దీన్ని కొనుగోలు చేశారని, సేల్స్ఫోర్స్కు దీనితో ఎలాంటి సంబంధం లేదని మెరిడెత్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక.. మ్యాగజైన్ రోజువారీ కార్యకలాపాల్లో బెనియాఫ్ ఎలాంటి జోక్యం చేసుకోబోరని, ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్ బృందమే నిర్ణయాలు తీసుకుంటుందని సంస్థ పేర్కొంది. యాలే యూనివర్శిటీకి చెందిన హెన్నీ లూస్, బ్రటన్ హాడెన్ ఈ టైమ్ మ్యాగజైన్ను ప్రారంభించారు. మొదటి పత్రిక 1923 మార్చిలో వెలువడింది. టైమ్ మ్యాగజైన్తో పాటు ఫార్చ్యూన్, మనీ, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ పబ్లికేషన్లను మెరిడెత్ ఈ ఏడాది మార్చిలో అమ్మకానికి పెట్టింది. తాజాగా టైమ్ను అమ్మివేయగా.. మిగతా మూడింటి విక్రయానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు మెరిడెత్ వెల్లడించింది. పత్రికల్లో ప్రకటనలు తగ్గిపోవడంతో టైమ్ సహా చాలా మ్యాగజైన్లకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆయా సంస్థలు విక్రయాల బాట పడుతున్నాయి.