Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైమండ్స్ దిగుమతి పేరుతో నిధుల తరలింపు
- వివిధ ప్రాంతాల్లో ఈడీ అధికారుల దాడులు..
న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ హవాలా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దేశంలో భారీగా నగదును సేకరించి, డైమండ్ల దిగుమతి పేరుతో విదేశాల్లోని సంస్థలకు జమ చేస్తున్న హవాలా రాకెట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తాజాగా గుర్తించింది. కోట్లాది రూపాయల భారీ హవాలా రాకెట్ తాజాగా వెలుగులోకి రావడంతో బుధవారం ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అంతర్జాతీయంగా ఈ హవాలా రాకెట్ విలువ రూ .700 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. దుబారుకి చెందిన హవాలా ఆపరేటర్ పంకజ్ కపూర్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కపూర్తో పాటు అతని అనుచరులపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీ , ముంబై నగరాల్లో 11 ప్రదేశాలలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 29.19 లక్షల నగదును, ఆదాయ పన్ను పత్రాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో పాటు, హవాలా లావాదేవీల రికార్డులను, 150 షెల్ సంస్థలకు సంబంధించిన స్టాంపు పత్రాలు, ఇతర వస్తువులను కూడా ఈడీ సీజ్ చేసింది.