Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదవీ కాలం పెంచేందుకు 'నో'..
ముంబయి: ప్రముఖ ప్రయివేటు బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్ సీఎండీ రాణా కపూర్కు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఊహించని షాక్నిచ్చింది. యెస్ బ్యాంక్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాణా కపూర్ పదవీ కాలం 2019 జనవరితో ముగుస్తుందని.. ఈ లోపు కొత్త సీఎండీని ఎంపిక చేసుకోవాల్సిందిగా ఆర్బీఐ యెస్ బ్యాంకునకు సూచించింది. కపూర్ పునర్నియామకం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ కీలక ఆదుశాలను జారీ చేసింది. వాస్తవానికి ఆగస్టు 31తో రాణా కపూర్ పదవీకాలం ముగిసింది. అయితే రాణా కపూర్ పదవీ కాలాన్ని మరో మూడేండ్ల పాటు పొడిగించేందుకు ఆర్బీఐ నుంచి అనుమతి లభించినట్టు యెస్ బ్యాంకు ఇటీవల (ఆగస్టు 30, 2018) ప్రకటించింది. తదుపరి నోటీస్ ఇచ్చేంత వరకూ రాణా కపూర్ను సీఈవో, ఎండీగా కొనసాగుతారని స్టాక్ఎక్చ్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. అటు ఈ ఏడాది జూన్లో యెస్ బ్యాంక్ వాటాదారులు మరో మూడేండ్ల పాటు కపూర్ పదవిలో కొనసాగేందుకు అనుమతించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆర్బీఐ రాసిన లేఖ తమకు చేరిందని యెస్ బ్యాంక్ ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న బ్యాంకు బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్టుగా తెలిపింది.