Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమర 'క్యాపిటల్'తో కలిసి వాటా కొనుగోలు ..
- రూ.4200 కోట్లకు కుదిరిన ఒప్పందం..
- బిగ్బజార్, రిలయన్స్, డిమార్ట్లకు షాక్!
- వాల్మార్ట్కు అమెజాన్ అనూహ్య ఝలక్
- అప్పుల భారం మోయలేకే అమ్మకానికి..
కోల్కతా: అమెరికా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ భారత్లో బహుముఖంగా విస్తరించేందుకు అందివస్తున్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. తాజాగా ఆ సంస్థ సమర క్యాపిటల్తో కలిసి ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన 'ఆదిత్య రిటైల్ లిమిటెడ్'ను (ఏబీఆర్ఎల్) కొనుగోలు చేసింది. ఏబీఆర్ఎల్ సంస్థ 'మోర్' బ్రాండ్తో దేశ వ్యాప్తంగా సూపర్ మార్కెట్లను నిర్వహిస్తూ వస్తోంది. సుమారు రూ.4200 కోట్లకు ఈ కొనుగోలు ఒప్పందం కుదిరినట్టుగా సమాచారం. ఏబీఆర్ఎల్ సంస్థ దేశ వ్యాప్తంగా దాదాపు 575 మోర్ స్టోర్లను కలిగి ఉంది. దేశంలో అమలులో ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనల మేరకు అమెజాన్ సంస్థ ప్రయివేటు ఈక్విటీ ఫండ్ సమరతో ఏబీఆర్ఎల్లో 51% వాటాను కొనుగోలు చేయించి. మిగతా 49% వాటాను ఆమెజాన్ తన భారత విభాగానికి చెందిన అమెజాన్ డాట్ కామ్ ఎన్వీ ఇన్వెష్ట్మెంట్ హోల్డింగ్స్ ఎల్ఎల్సీతో కొనిపించినట్టుగా సమాచారం. అయితే ఈ డీల్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించాల్సి ఉంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్థకు త్వరలోనే నామకరణం చేయనున్నట్టుగా సమాచారం. ఆదిత్య బిర్లా అప్పరెల్ విభాగాధిపతి ప్రణబ్ బరువా కొత్తగా ఏర్పడే సంస్థ సారథ్య బాధ్యతలను చేపట్టన్నుట్టుగా సమాచారం. మోర్ సంస్థలో సమర క్యాపిటల్ అత్యధిక వాటాను కొనుగోలు చేసినప్పటికీ.. నిర్వహణపై ఆ సంస్థ ఎలాంటి ఆసక్తి చూపకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పలు విదేశీ పెట్టుబడిదారుల సమూహంగా ఉన్న సమర సంస్థకు ఆర్థికంగా దన్నునిస్తుందని.. అమెజానే కొత్త సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు.
లాభాలు వస్తున్నా.. అమ్మక తప్పలేదు..
ఏబీఆర్ఎల్కు చెందిన మోర్ సంస్థ మెరుగైన పనితీరు కనిపిస్తూ రాణిస్తున్పప్పటికీ.. ఆ సంస్థ కొత్త సంస్థల కొనుగోలు చేసిన అప్పులు చివరకు మోర్ మనుగడకే ప్రమాదకరంగా మారాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 575 శాఖలతో విస్తరించిన ఉన్న మోర్ సూపర్మార్కెట్లు దాదాపు గరిష్టంగా లాభాలను ఆర్జిస్తూ వస్తున్నాయి. అయితే ఈ లాభాల్లో అధిక భాగం కొత్త సంస్థల కొనుగోలుకు చేసిన అప్పులకు వడ్డీకే సరిపోతుండడంతో రిటైల్ విభాగం నష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఏబీఆర్ఎల్ దశాబ్ద కాలం కిందట త్రినేత్ర సూపర్ మార్కెట్లను, ఫ్యాబ్మాన్ సూపర్మార్కెట్లను కొనుగోలు చేసింది. వీటిని అప్పట్లో రుణాల రూపంలో నిధుల సమీకరణ జరిపి సంస్థ కొనుగోలు జరిపింది. సంస్థ విస్తరణ ప్రణాళికలో భాగంగా జూబిలియంట్కు చెందిన టోటల్ సూపర్ స్టోర్స్ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో సంస్థ రుణ భారం రూ.6,573 కోట్లకు చేరుకుంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఏబీఆర్ఎల్ సంస్థ రూ.2,800 కోట్ల విలువైన కన్వెర్టబుల్ బాండ్లను ఈక్విటీలు మార్చి నగదీకరించింది. దీంతో రుణ భారం రూ.4000 కోట్లకు దిగివచ్చింది. తాజాగా ఏబీఆర్ఎల్ సంస్థ మొత్తం రుణ భారం తీరిపోవడంతో పాటు గ్రూపుకు మరో రూ.200 కోట్ల మేర లాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అన్ని విధాలా అమెజాన్కే లాభం..
ఏబీఆర్ఎల్కు చెందిన మోర్లో 49 శాతం వాటాను చేజిక్కించుకోవడంలో అమెజాన్ సంస్థ ఒకే దెబ్బకు రెండు పిట్టలు విధానాన్ని అనుసరించినట్టుగా కనిపిస్తోంది. తాజాగా మోర్కొనుగోలుతో భారత్లో నాలుగో అతిపెద్ద రిటైల్ చైన్గా ఉన్న మోర్ స్టోర్లు తన ఆధీనంలోకి రానుంది. దీనికి తోడు ఇన్వెంటరీ ఆధారిత ఈ-కామర్స్ విభాగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి లేని నేపథ్యంలో ఇప్పుడు మోర్ ద్వారా తన ప్రత్యక్ష విక్రయపు చైన్ను కూడా విస్తరించేందుకు ఆ సంస్థకు వీలు కలుగనుంది. మరోవైపు తన ప్రధాన వ్యాపార శత్రువు వాల్మార్ట్ ఇటీవల ఫ్లిప్కార్టులో కీలక వాటాను కొనుగోలు చేసి భారత్లో ఆన్లైన్, ఆఫ్లైన్ల మార్గంలో తిష్టవేయాలని ప్రణాళికలు రచిస్తోంది. తాజా కొనుగోలుతో వాల్మార్ట్ విస్తరణ ప్రణాళికకు అమెజాన్ కొత్త సవాలు విసిరినట్టయింది. అమెజాన్ సంస్థ మోర్ను కొనుగోలు చేసిన నేపథ్యంలో దేశీయ రిటైల్ దిగ్గజాలుగా వెలుగొందుతున్న బిగ్బజార్, రిలయన్స్ రిటైల్, డి-మార్ట్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. మోర్ కొనుగోలు తరువాత ఏడాది 100-150 కొత్త స్టోర్ల ఏర్పాటు చేయాలని సమర-అమెజాన్లు భావిస్తున్నట్టుగా సమాచారం. కొని సూపర్ మార్కెట్లను హైపర్ మార్కెట్లుగా మార్చేందుకు కూడా అమెజాన్ ఆలోచిస్తున్నట్టుగా వినికిడి. భారత్లో విస్తరించాలని బలంగా ప్రయత్నిస్తున్న అమెజాన్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా దాదాపు 90 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టుగా సంస్థ అధికారి ఒకరు తెలిపారు. రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న ఏబీఆర్ఎల్ను కొనుగోలు చేసేందుకు గాను సమర ఫండ్తో కలిసి గోల్డ్మెన్శాక్స్ తొలత చక్రం తిప్పింది. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో గోల్డ్మెన్ ఈ ప్రతిపాదన నుంచి వైదొలగడంతో.. అమెజాన్ పూర్తి స్థాయిలో చక్రం తిప్పి మోర్ను చేజిక్కించుకున్నట్టుగా సమాచారం.