Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోలుకొనేందుకు 2-3 ఏండ్లు పడుతుంది
- మెరుగైన నిర్వహణకు 'ఏకీకరణ' అవసరం
- 'స్ట్రెస్డ్ అసెట్స్' పరిష్కారానికి అన్ని యత్నాలు
- ఎస్బీఐ చైర్మెన్ రజనీష్ కుమార్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని స్థిరీకరించే ప్రయత్నాల్లో భాగంగా సర్కారు చేపట్టిన బ్యాంకుల విలీనపు ప్రక్రియను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మెన్ రజనీష్ కుమార్ సమర్థించారు. అయితే ఈ క్రమంలో తమ బ్యాంక్ మరిన్ని బ్యాంకుల విలీనం చేసుకొనే స్థితిలో లేదని మాత్రం ఆయన తేల్చి చెపారు. ఇటీవలే ఎస్బీఐ అయిదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంక్లను విలీనం చేసుకున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రస్తుత పరిస్థితుల నుంచి బ్యాంక్ నిలదొక్కుకొని లాభాలను ఆర్జించేందుకు గాను మరో రెండు నుంచి మూడేండ్ల సమయం పడుతుందని ఆయన వివరించారు. ఆ తరువాతే మరిన్ని విలీనాల దిశగా యోచిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మరిన్ని బ్యాంకులను విలీనం చేసుకొనేందుకు తాము సరైన ఎంపిక కాదంటూ వివరణనిచ్చారు. ఎస్బీఐ ఇప్పటికే దాదాపు 23% మార్కెట్ వాటాతో దేశంలో బ్యాంకింగ్ దిగ్గజంగా వెలుగొందుతోందని అన్నారు. మరిన్ని బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేయడం వల్ల ఈ రంగంలో తమ బ్యాంక్ గుత్తాధిపత్యం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. దేశంలో ప్రభుత్వ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు గాను ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణ ద్వారా వాటి సంఖ్యను కుదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రా యపడ్డారు. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన 'బ్యాంకింగ్ రంగ ప్రత్యామ్నాయ వ్యవస్థ' (ఏఎం) బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్లను విలీనపు ప్రతిపాదనను వెల్లడిం చిన నేపథ్యంలో ఎస్బీఐ చైర్మెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మూడు బ్యాంకుల విలీనం తరువాత దాదాపు రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో కొత్త బ్యాంక్ దేశంలోనే మూడు అతిపెద్ద బ్యాంక్గా అవతరించనుంది. దేశంలో పెద్ద బ్యాంకులుగా ఉన్న ఎస్బీఐ, ఐసీఐసీఐ తరువాత స్థానంలో కొత్త విలీనపు బ్యాంక్ అవతరించనుందని సర్కారు ఇప్పటికే వెల్లడించింది. మూడు బ్యాంకుల విలీనం తరువాత కొత్తగా ఏర్పడనున్న బ్యాంక్ నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 5.71 శాతంగా నిలువనుంది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల 12.13 శాతం నిష్పత్తి కంటే ఎంతో తక్కువగా ఉండడం విశేషం. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సవాలుగా మారిన విద్యుత్తు రంగంలోని ఒత్తిడిలోని ఆస్తుల పరిష్కారానికి గాను తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిపారు. స్ట్రెస్డ్ అసెట్స్ విషయంలో దివాలా, దివాలా చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పించడానికి తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని వివరించారు.