Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో ధరల మంటకు అద్దం పడుతూ టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మరోమారు ఎగిసింది. ఆహరోత్పత్తుల ధరలు పెరగడం, పెట్రోలు, డీజిల్ల ధరలు ఎగిసిపడడం తదితరాల కారణంగా సెప్టెంబరు మాసంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ 5.13 శాతానికి చేరింది. ఇది రెండు నెలల గరిష్టం కావడం విశేషం. అంతకు ముందు ఆగస్టు మాసంలో డబ్ల్యూపీఐ 4.53 శాతంగా నమోదు అయింది. గత ఏడాది సెప్టెంబరు మాసంలో టోకు ద్రవ్యోల్బణం 3.14 శాతంగా ఉంది. దీనికి తోడు జులైలో వెల్లడించిన.. టోకు ధరల ద్రవ్యోల్బణం అంచనాలను కూడా సర్కారు సవరిస్తూ 5.09 శాతం నుంచి పెంచి 5.27 శాతానికి పెంచింది. ఏడాది ప్రాతిపదికన పోల్చిచూస్తే సెప్టెంబరు మాసంలో తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 2.99 శాతం నుంచి 4.22 శాతానికి చేరింది. అంతకు ముందు ఆగస్టులో మాసంలో తయారీ వస్తువుల ద్రవ్యోల్బనం 4.43 శాతంగా ఉంది. మరోవైపు ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 0.14 శాతంగాను, ఇంధన మరియు విద్యుత్తు ద్రవ్యోల్బణం 16.65 శాతంగాను, ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 2.97 శాతంగాను నమోదు అయింది. సెప్టెంబరు మాసంలో ఆహార వస్తువుల ధరలు పెరగడంతో ఈ రంగపు ధరల సూచీ 0.21% ప్రతి ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆగస్టు మాసంతో ఇది 4.04 శాతంగా నమోదు అయింది. కూరగాయల ధరలు కూడా 3.83 శాతం ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారుకున్నాయి.