Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పండుగల సీజన్ను దృష్టి ఉంచుకొని ఈ-కామర్స్ సంస్థలు గడిచిన ఐదు రోజుల్లో దుమ్మురేపే అమ్మకాలను నమోదు చేశాయి. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు గత అయిదు రోజులుగా వివిధ ఆకర్షణీయమైన ఆఫర్లతో బంపర్ సేల్స్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల పండుగల సేల్స్ సోమవారంతో ముగిశాయి. ప్రస్తుత పండుగల సీజన్ దృష్టి ఉంచుకొని సంస్థలు జరిపిన ప్రత్యేక ఆఫర్ సేల్స్ ద్వారా రెండు సంస్థలు గడిచిన ఐదు రోజుల్లో దాదాపు రూ.15000 కోట్ల అమ్మకాలు జరిపినట్టుగా మార్కెట్ వర్గాలు అంచనా కడుతున్నాయి. ఈ నెల 9-14 మధ్య కాలంలో ఈ-టైలర్ సంస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు అమ్మకాలన నమోదు చేసినట్టుగా రెడ్సీర్ కన్సెల్టింగ్ తెలిపింది. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి అనూహ్యమైన అమ్మకాలు నమోదు కావడంతో పాటు ఇంటర్నెట్ వాడకం పెరగడం కారణంగా మెరుగైన అమ్మకాలు నమోదు అయినట్టుగా ఈ కన్సెల్టింగ్ సంస్థ తెలిపింది. దీనికి తోడు చౌక ధరలు, లోయాలిటీ పథకాలు కూడా కొనుగోలుదారులు ఈ దిశగా దృష్టి సారించేందుకు దోహదం చేసినట్టుగా సంస్థ విశ్లేషించింది.