Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రాధాన్యత రంగాల్లో విక్రయాలు
- మరో 8600 కోట్ల సమీకరణే లక్ష్యం
- హౌసింగ్, బీమాల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బృందం చేసిన కుంభకోణం నుంచి కోలుకొని తిరిగి ప్రగతి పట్టాలెక్కేందుకు గాను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటోంది. ఇందులో భాగంగా సంస్థ దాదాపు రూ.8600 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. పలు రకాల ఆస్తులతో పాటు, గృహ రుణాల సంస్థలో వాటా విక్రయం కూడా ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ అప్రాధాన్యేతర విభాగాల్లో ఆస్తుల విక్రయాన్ని చేపట్టనున్నట్టుగా పీఎన్బీ సంస్థ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. ఇటీవలే దాదాపు రూ.4000 కోట్ల మేర నిధుల సమీకరణకు గాను పీఎన్బీ పలు ఆస్తులను విక్రయించిన సంగతి తెలిసిందే. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో తమ ఆస్తి విక్రయానికి గాను ఇప్పటికే మెర్చంట్ బ్యాంకర్లను నియమించుకున్నట్టుగా సునీల్ మెహతా వెల్లడించారు. ఇందుకు గాను బిడ్డింగ్లను ఆహ్వానించినట్టుగా వెల్లడించారు. దీనికి తోడు బీమా సంస్థలోను తమ వాటాను 4 శాతం మేర కూడా విక్రయించాలని బ్యాంక్ భావిస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే పలు స్థిరాస్తుల విక్రయాలు జరిపామని వివరించారు. నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకు ఆస్తుల విక్రయం పూర్తికాగలదని తాము భవిస్తున్నామని వివరించారు. పీఎన్బీ హౌసింగ్లో వాటా కొనుగోలుకుగాను చాలా మంది దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నట్టుగా ఆయన తెలిపారు. కంపెనీ మూలాలు బలంగా ఉన్నందున దీర్ఘకాలిక లాభోద్ధేశ్యంతో వారు కంపెనీలో కీలక వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నారన్నారు. ఈ ఆస్తుల విక్రయ ప్రతిపాదనకు మంచి స్పందన లభించగలదని భావిస్తున్నామని ఆయన అన్నారు. బడాబాబులకు కోట్ల రూపాయల అప్పులిచ్చిన బ్యాంకులు ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రక్రియలో భాగంగా ఆయా బ్యాంకులకు చెందిన వేలాది కోట్ల రూపాయల ఆస్తులను విక్రయిస్తుండడం పట్ల సర్వత్రా విమర్షలు వినవస్తున్నాయి. ఈ విషయంలో సర్కారు కూడా బ్యాంకులకు అండగా నిలవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.