Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మకానికి జీడిమెట్ల ఏపీఐ ప్లాంటు
- మొత్తంగా థెరపివియా చేతుల్లోకి ఏపీఐ
- సానుకూలంగా స్పందించిన మార్కెట్లు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ డాక్టర్ రెడ్డీస్ హైదరాబాద్లోని తమ కీలక తయారీ యూనిట్ను అమ్మకానికి పెట్టింది. జీడిమెట్లలో సంస్థకు ఉన్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీ వ్యాపారాన్ని ఆస్తులతో సహా థెరపివియాస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు విక్రయించింది. ఇందుకు సంబంధించి ఆ సంస్థతో తాము ఒక నిర్ధిష్ట ఒప్పందం కుదిరినట్టుగా సంస్థ తెలిపింది. ఆబుదబికి చెందిన నియోఫార్మా సంస్థకు చెందిన అనుబంధ సంస్థ ఓమ్మికేర్ డ్రగ్స్ ఇండియా మరియు లెక్సియా లైఫ్ సైన్సెస్స్ల సంయుక్త సంస్థయే థెరపివియాస్. ఈ ప్లాంటుకు చెందిన మొత్తం భూమి, భవనాలు, ప్రస్తుత ఆస్తులు, అప్పులు, ఉద్యోగులను కలుపుకొని ఈ అమ్మకం ప్రక్రియ సాగినట్టుగా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థ తయారీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు, మరియు వ్యయ నిర్మాణాన్ని గరిష్టస్థాయికి చేర్చేందుకు గాను ఈ అమ్మకం ఎంతగానో దోహదం చేయనుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అధినేత సంజరు శర్మ తెలిపారు. కొనుగోలు సంస్థ డాక్టర్ రెడ్డీస్ పని తీరును, సామర్థ్యాన్ని ఉద్యోగుల శక్తిని పూర్తిస్థాయిలో అర్ధం చేసుకొని కొనుగోలుకు ముందుకు వచ్చినట్టుగా ఆయన తెలిపారు. రెండు కంపెనీల బలమైన వ్యాపార సంసృతి ఒకరితో ఒకరికి సరిపోవడం.. భవిష్యత్తులో వృద్ధికి ఉన్న అవకాశాలను దృష్టి ఉంచుకొనే తాము సంస్థ ప్లాంట్ కొనుగోలుకు ముందుకు వచ్చినట్టుగా థెరపివా సీఈవో వంశీ మద్దిపట్ల తెలిపారు. మొత్తం నగదు వ్యవహారంగా ఈ అమ్మకం జరిగినట్టుగా సమాచారం. అయితే ఎంత మొత్తానికి ప్లాంట్ విక్రయించారన్నదానిపై ఇరు సంస్థలు స్పష్టతను ఇవ్వలేదు. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ రెడ్డీస్ సంస్థ భాగ్యనగరం కేంద్రంగా పని చేస్తున్న కీలక ఏపీఐ ప్లాంట్ను విక్రయించడం ఇండిస్టీ వర్గాలను అశ్చర్యానికి గురి చేశాయి. డాక్టర్ రెడ్డీస్ ప్లాంట్ విక్రయం వార్తకు మార్కెట్లు సానుకూలంగా స్పందిచాయి. ఈ కంపెనీ షేరు దాదాపు 4 శాతం వరకు పెరిగింది.