Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ ఔషధ రంగంలో అతిపెద్ద అమ్మకానికి రంగం సిద్ధమవుతోంది. దేశీయంగా కుబేరుడిగా పేరున్న అజరు పిరమల్ ఫార్మా రంగంలోని తన 'కాంట్రాక్ట్ ఫార్మాస్యూటికల్స్ ఆపరేషన్స్' (సీపీఏ) విక్రయం దిశగా ముందుకు సాగుతున్నట్టుగా సమాచారం. ఈ విక్రయం ద్వారా ఆయన దాదాపు రూ.6,500 కోట్ల (దాదాపు బిలియన్ డాలర్లు) సొమ్మును ఆర్జించేలా వాటా విక్రయ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టుగా ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులు మీడియాకు వెల్లడించారు. పిరమల్ ఫార్మా సొల్యూషన్స్ (పీపీఎస్) విక్రయానికి గల అవకాశాలు, సంస్థ సామర్థ్యానికి సంబంధించిన వివరాలను పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఔత్సాహిక సంస్థలకు అందించింది. పిరమల్ ఫార్మా సొల్యూషన్ సంస్థ ఫార్మా కాంట్రక్ట్ డెవలప్మెంట్తో పాటు ఆయా సంస్థల తరఫున ఔషధ తయారీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు గాను పలు ప్రయివేటు ఈక్విటీ సంస్థలు, అమెరికా కంపెనీలు కూడా ఆసక్తిగా ఉన్నట్టుగా సమాచారం. పిరమల్ ఫార్మా అమ్మకం వార్తల నేపథ్యంలో ఫిరమల్ ఎంటర్ప్రైజెస్ సంస్థ వాటాలు మంగళవారం 4.7 శాతం మేర పెరిగాయి. ఆ తరువాత మార్కెట్లు ముగిసే సమయానికి దాదాపు 3.45 శాతం లాభంతో 2329 వద్ద ముగిశాయి.