Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి భారీగా పతనమైన మార్కెట్లు
- 464 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 1.60 లక్షల కోట్ల మేర సంపద ఆవిరి
- ప్రభావం చూపిన ఆర్బీఐ ప్రకటనలు
- ఆజ్యం పోసిన అంతర్జాతీయాంశాలు..
ముంబయి: మదుపరుల దసరా ఉత్సాహాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఆవిరి చేశాయి. శుక్రవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. హెచ్ 1బీ వీసా విధానంలో ట్రంప్ యంత్రాగం భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో పాటు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బకొట్టాయి. దీనికి తోడు దేశీయగా ఎన్బీఎఫ్సీ సంస్థల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. వారాంతమైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు ఉదయం 408 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సుమారు 600 పాయింట్లకు పైగా నష్ట పోయింది. రిలయన్స్ కంపెనీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చివరి గంటలో మార్కెట్లు కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టాలు మాత్రం తప్పలేదు. సెన్సెక్స్ 463.95 పాయింట్లు నష్టపోయి 34,315.63 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 149.50 పాయింట్లు నష్టపోయి 10,303.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.49 వద్ద కొనసాగుతోంది. ఈ దెబ్బతో బీఎస్ఈలో మదుపర్లు ఒకే పూటలో రూ.1.60 లక్షల కోట్ల విలువ కోల్పోయారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం దసరా వేడుకలను చేసుకుంటున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మదుపరులను నష్టాలతో షాక్కు గురి చేశాయి. రిలయన్స్ ఆర్ధిక ఫలితాలు సంబంధిత ప్రకటనలు మదుపరులను ఉత్సాహపరచలేకపోయాయి. తోడు మరోవైపు యస్ బ్యాంకు సిఇఒ రాణా కపూర్ పదవీ కాలాన్ని రెండో సారి పొడగించడానికి రిజర్వు బ్యాంకు నిరాకరించడం మరింత ప్రతికూలతను పెంచింది. ఆసియన్ సూచీలు బలహీనంగా నమోదయ్యాయి. రిలయన్స్ ఫలితాలు మార్కెట్ల అంచనాలను చేరలేకపోయాయి. దీంతో ఆ సూచీ 4.11 శాతం పతనమై రూ.1,101.65కి పడిపోయింది. బ్యాంకింగ్లో యస్ బ్యాంకు సూచీ అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ సూచీ ఏకంగా 6.06 శాతం నష్టపోయి రూ.217.70కు దిగజారింది. తనఖా కంపెనీ హెచ్డీఎఫ్సీ 4.32 శాతం నష్టపోయి రూ.1,661.30 వద్ద ముగిసింది. హీరో మోటో, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ సూచీలు వరుసగా 3.70 శాతం, 3.11 శాతం, 3.46 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంకు, వేదాంత, అదానీ పోర్ట్సు సూచీలు 1.74 శాతం, 1.51 శాతం, 1.18 శాతం చొప్పున లాభపడ్డాయి. దేశంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఐఎఫ్సీ) తోడ్పాటు అందించేలా ఆర్బీఐ శుక్రవారం చేసిన ప్రకటన మార్కెట్లలో కొత్త గుబులును రేపింది. చెల్లింపుల్లో విఫలమైన ఐఎల్అండ్ఎఫ్ఎస్ దెబ్బతో రిజర్వు బ్యాంకు ఎన్బీఎఫ్సీలకు మద్దతు అందించడానికి ఆర్బీఐ నగదు నిధుల పరిమితిని పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం ఏ బ్యాంకు అయినా ఎన్బీఎఫసీల్లో ప్రస్తుతం 10 శాతంగా ఉన్న మూలధన పెట్టుబడులను 15 శాతం వరకు పెంచుకొనేందుకు అనుమతినిచ్చింది. ఈ నిబంధనలు 2018 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది.