Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: రిలయన్స్ ఇండిస్టీస్ (ఆర్ఐఎల్) శనివారం మార్కెట్ వర్గాలను నివ్వెరపరిచే నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సారథిగా వ్యవహరించి.. ఇటీవలే పదవి విరమణ పొందిన అరుంధతి భట్టాచార్యను తమ బోర్డులో చేర్చుకుంటున్నట్టుగా ప్రకటించింది. పదవి విరమణ అనంతరం నిబంధనల ప్రకారం బ్యాంక్ సారథులు కొన్ని రోజులు ఎలాంటి కీలక పదవులను చేపట్టకుండా 'కూలింగ్ పీరియడ్' ఉంటుంది. ఇటీవలే భట్టాచార్యకు ఈ నిబంధన పూర్తికావడంతో అరుంధతిని రిలయన్స్ తమ సంస్థలోకి చేర్చుకుంది. క్రిస్ క్యాపిటల్ సంస్థ ఇటీవలే భట్టాచార్యను తమ సలహాదారుగా నియమించుకుంది. మరోవైపు ఆమె పిరమల్ ఎంటర్ప్రైజెస్లో అరుంధతి చేరనున్నారన్న వార్తలు వినవచ్చాయి. అయితే ఈ లోపే అనూహ్యంగా రిలయన్స్ సంస్థ భట్టాచార్యను తమ బుట్టలో వేసుకున్నట్టుగా ప్రకటన రావడంతో కార్పొరేట్ ప్రపంచం నివ్వెరపోయింది. రిలయన్స్ సంస్థ బోర్డులో ప్రస్తుతం నీతా అంబానీ ఒక్కరే బోర్డులో మహిళా సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అరుంధతి చేరికతో ఈ సంఖ్య రెండుకు చేరనుంది. ఐదేండ్ల పాటు కొనసాగనుందని ఆర్ఐఎల్ తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయవు పట్టులాంటి ఎస్బీఐ సంస్థకు అధినేతగా వ్యవహరించిన అరుంధతిని రిలయన్స్ తన బోర్డులోకి చేరుకోవడంతో ఆ సంస్థకు ఇకపై ఆర్థిక కష్టాలనేవే ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి మరింత గరిష్టంగా రిలయన్స్ అప్పులు పొందేందుకు భట్టాచార్య చేరిక దోహదం చేయగలదని విశ్లేషకులు అంటున్నారు.