Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ మార్కెట్లు మరోసారి ఊరించి ఉసూరుమనిపించాయి.సోమవారం కొనుగోళ్ల అండతో ఉత్సాహంగా ట్రేడింగ్ను ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో అమ్మకాల సెగ కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ వారంలో వెలువడబోయే కంపెనీల త్రైమాసిక ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. మరోవైపు అక్టోబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు కూడా ముగియనుండటంతో సోమవారం సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. సోమవారం ఉదయం సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ఆరంభించగా.. నిఫ్టీ కూడా 90 పాయింట్లకు పైగా లాభంతో మొదలైంది. అయితే ఆ జోరు ఎంతోసేపు నిలువలేదు. మదుపర్ల అప్రమత్తతో మార్కెట్ ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే సూచీలు ఆరంభ లాభాల్లో చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా సేపు స్వల్ప లాభాల వద్దే ఊగిసలాడిన సూచీలు మధ్యాహ్నం సమయానికి పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే గంట ముందు అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా దిగజారింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 181 పాయింట్ల నష్టంతో 34,134 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 58 పాయింట్ల నష్టంతో 10,245 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ మరింత పతనమై 73.42గా కొనసాగింది. ఎన్ఎస్ఈలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఈ కంపెనీ షేరు ధర దాదాపు 9శాతం పెరిగింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో షేర్లు కూడా లాభపడగా.. ఇండస్ఇండ్ బ్యాంక్, భారత్ పెట్రోలియం, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.