Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహన విక్రయాలకు పెట్రో ధరల మంట
- పండుగ వేళా పడిపోయిన బండ్ల సేల్స్..
ముంబయి: ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను అంతకంతకు పెంచుతూ పోతుండడం.. వాహన తయారీ రంగ పరిశ్రమలకు శాపంగా మారుతోంది. పెట్రోలు ధర మార్కెట్లో లీటరు రూ.100కు చేరవవుతున్న నేపథ్యంలో.. సామాన్యులు బండ్లు తీయాలంటేనే జడుసుకుంటున్నారు. మోడీ పాలనలో పెట్రోలు, డీజిల్ ధరలకు కళ్లెం లేకుండా పోవడంతో ఇప్పటికే బండ్లు నడుపుతున్న మధ్య తరగతి వారు బండ్లు, కార్ల వాడాకాన్ని క్రమంగా తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు కొత్తగా బండ్లు కొనాలనుకొనే వారు కూడా చమురు దెబ్బకు భయపడి కొత్త వాహనాల కొనుగోలుకు సాహసం చేయలేకపోతున్నారు. దీంతో వాహన తయారీ సంస్థలు ఎన్ని ఆఫర్లు పెట్టినా.. కొనుగోళ్లు మాత్రం పుంజుకోవడం లేదు.
నిరుత్సాహపరిచిన నవరాత్రులు..
పండగ రోజుల్లో కార్లు, బైక్లు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకు తగ్గట్లుగా ఆటోమొబైల్ సంస్థలు కూడా పండగ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇక నవరాత్రి, దసరా రోజుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజుల్లో వాహన విక్రయాలు జోరందుకుంటాయి. అయితే గత కొన్నేళ్లతో పోలిస్తే ఈసారి దసరా మాత్రం కార్ల ఉత్పత్తిదారులకు అంతగా కలిసిరాలేదు. పెరుగుతున్న చమురుధరలు, బీమా ఖర్చుల వల్ల ఈ ఏడాది నవరాత్రుల్లో కార్ల విక్రయాలు అంతంతమాత్రంగానే జరిగాయి. ఇటీవల వినాయకచవితి, ఓనమ్ పండగ రోజుల్లో కార్ల విక్రయాలు ఆశించిన మేర జరగకపోవడంతో ఆటోమొబైల్ సంస్థలు దసరా కోసం ఎదురుచూశాయి. అయితే నవరాత్రుల్లోనూ పరిస్థితి ఏమాత్రం మారలేదు. గత ఆరేళ్లతో పోలిస్తే ఈ ఏడాది దసరా రోజుల్లోనే అత్యంత తక్కువ వాహనాలు అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆశిల్ కాలే తెలిపారు. ఈ ఏడాది దసరా నవరాత్రుల్లో కార్ల రిటైల్ అమ్మకాలు 5 నుంచి 20శాతం, ద్విచక్రవాహనాల అమ్మకాలు 15-20% మేర తగ్గాయని కాలే వెల్లడించారు. గత కొన్ని నెలలుగా చమురు ధరలు 15శాతం పెరిగాయని ఆయన అన్నారు. ఇక వాహన బీమా ఖర్చుల 100 శాతం పెరగడం,. వడ్డీరేట్లు 50 బేసిస్ పాయింట్ల వరకు పెరగడం ప్రధానంగా వాహనాల కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దీపావళికైనా అమ్మకాలు వెలిగేనా..
వినాయక చవితి, ఓనమ్ పండుల సందర్భంగా వాహనాల అమ్మకాలలో పెద్దగా వృద్ధి నమోదు కాలేదు. తాజాగా ఇప్పడు దసరా సేల్స్ కూడా నిరుత్సాహపర్చడంతో వచ్చే దీపావళి పండగపైనే ఆటోమొబైల్ సంస్థలు ఆశలు పెట్టుకున్నారు. 'దీపావళి సందర్భంగా కార్ల విక్రయాలు పెరగొచ్చని ఆశిస్తున్నాం. రెండంకెల వృద్ధి పక్కనబెడితే కనీసం గతేడాది జరిపిన విక్రయాల సంఖ్యనైనా ఈసారి చేరుకోవాలి. లేదంటే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది' అని కాలే అన్నారు.