Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనంగా దూసుకు వచ్చిన రిలయన్స్ జియో దెబ్బతో మిగతా ఆపరేటర్లు కూడా టారిఫ్లు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేశాయి. కొన్నయితే ఈ పోటీలో నిలదొక్కుకోలేక నిష్క్రమించాయి. ఈ పరిణామాలు టెలికాం రంగంలోని ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నష్టాలను తగ్గించుకునేందుకు కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో వేల మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి టెలికాం రంగంలో 60వేల మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు తాజాగా కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. 2019 మార్చి 31 నాటికి టెలికాం రంగంలో దాదాపు 65 వేల మంది సిబ్బంది తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదముందని ఉద్యోగ కల్పన సంస్థ 'టీమ్లీస్ సర్వీసెస్' అంచనా కట్టింది. ఎక్కువగా కస్టమర్ సపోర్ట్, ఫైనాన్షియల్ ఫంక్షన్స్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులను తొలగించాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ విభాగాల్లో దాదాపు 7వేల నుంచి 8వేల చొప్పున ఉద్యోగులను తొలగించే అవకాశాలున్నట్లు టీమ్లీస్ పేర్కొంది. మరో స్టాఫింగ్ సంస్థ రాడ్స్టడ్ ఇండియా కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగంలో 60 వేల నుంచి 75 వేల ఉద్యోగాలపై కోత పడే ప్రమాదముందని తెలిపింది.