Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబానీ ఎరిక్సన్ అప్పులు చెల్లించాల్సిందే..
- డిసెంబరు, 15 లోపు క్లియర్ చేయండి
- ఇక మరోసారి గడువు పెంచం: సుప్రీం
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) అధినేత అనిల్ అంబానీకి దేశపు పెద్దకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ఎరిక్సన్ వివాదంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలను జారీ చేసింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ డిసెంబర్ 15లోపు స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు రూ.550 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇకపై గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30లోపు 12 శాతం వడ్డీ రూ.550 కోట్లను చెల్లించాలని ఇంతకు ముందే కోర్టు ఆర్కామ్ను ఆదేశించింది. అయినప్పటికీ డబ్బు చెల్లించక పోవడంతో మరోసారి కోర్టు గడువు పెంచింది. ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీ, మరో ఇద్దరు సీనియర్ అధికారులు దేశం విడిచి పోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎరిక్సన్ గతంలో పిటిషన్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమకు ఉద్దేశ పూర్వకంగానే అంబానీ డబ్బు చెల్లించడం లేదని ఆరోపించింది. ఆర్కామ్ ఇకపై ఆస్తులు విక్రయించేందుకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. చెల్లింపుల ఆలస్యంపై జస్టిస్ రోహిన్టన్ ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తులతో కడిన ధర్మాసనం ఆర్కామ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువును మరోసారి పెంచిన ధర్మాసనం.. డిసెంబర్ 15 లోపు స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు రూ.550 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఆలస్యమైతే సంవత్సరానికి 12శాతం వడ్డీ చెల్లించాలని కూడా తేల్చి చెప్పింది. దీంతో ఆర్కామ్ డెఫెన్స్లో పడింది.
కావాలనే జాప్యం చేస్తున్నారు..: ఎరిక్సన్
తమ ఆస్తుల అమ్మకానికి టెలికాం శాఖ అనుమతి రాగానే ఎరిక్సన్కు డబ్బు చెల్లిస్తామని ఆర్కామ్ కోర్టుకు తెలిపింది. అనుమతి విషయం తమ పరిధిలో లేదని వివరించింది. స్పెక్ట్రమ్ను విక్రయానికి నిరభ్యంతర పత్రం ఇచ్చిన వారం రోజుల్లో నగదు చెల్లిస్తామని వెల్లడించింది. కాగా ఇప్పటికే విక్రయించిన ఆస్తుల ద్వారా ఆర్కామ్కు రూ.5000 కోట్లు వచ్చాయని ఎరిక్సన్ తెలిపింది. తమకు ఆలస్యంగా డబ్బు చెల్లించాలనే ఆర్కామ్ టెలికాం అనుమతి అంటూ మెలిక పెడుతోందని ఆరోపించింది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ సేవల కోసం 2014లో ఆర్కామ్, ఎరిక్సన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పనుల కోసం ఎరిక్సన్ రూ.1,150 కోట్లు ఖర్చుచేసింది. వాటిని తిరిగి చెల్లించలేకపోవడంతో ఆర్కామ్ సహా ఇతర సంస్థలు దివాళా తీసినట్టు ప్రకటించాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వద్ద కేసు వేసింది.