Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ తీరుతో తీవ్ర ఒత్తిడిలో ఉర్జిత్..
- పొగబెడుతున్న బోర్డు సభ్యుల మాటలు..
- హుందాగా తప్పుకొనే యోచనలో పటేల్
- అనారోగ్య కారణాలతో పదవికి గుడ్బై!
- 19న సమావేశంలో ఈ దిశగా నిర్ణయం
నవతెలంగాణ వాణిజ్య విభాగం: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ), కేంద్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలనే సాకుగా చూపుతూ.. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం బోర్డు రూపంలో పావులు కదుపుతున్న వేళ.. వివాదానికి కేంద్ర బింధువుగా నిలుస్తున్న.. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ నిరంకుశ ధోరణికి తలవంచి ఆర్బీఐని సర్కారు ఇంటి సంస్థగా మార్చడం ఉర్జిత్ ససేమీరా ఇష్టం లేనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా అంచనాల ప్రకారం ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం ఖాయమని తెలుస్తోంది.
తీవ్ర ఒత్తిడిలో ఉర్జిత్ పటేల్..
ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టుగా సమాచారం. మౌనమునిగా.. ఎక్కువగా మాట్లాడటం ఇష్టపడని ఉర్జిత్ పటేల్ ఇటీవల ప్రభుత్వం నుంచి వివిధ అంశాలపై ఒత్తిడి పెరుగుతున్న వేళ తన సన్నిహితుల వద్ద తన గోడును వెలిబుచ్చుకుంటున్నట్టుగా సమాచారం. ప్రభుత్వంతో విభేదించి అలసిపోవడమే కాక, వైరిపూరిత వాతావరణంలో పని చేయడం వల్ల తన ఆరోగ్యం పాడవుతున్నదని.. పటేల్ తన సన్నిహితుల వద్ద మొరపెట్టుకుంటున్నారట. ముఖ్యంగా రిజర్వ్బ్యాంక్ చట్టంలోని సెక్షన్-7 కింద ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో గవర్నర్ ఊర్జిత్ పటేల్ మరింత మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు సమాచారం. ఈ కారణంతో ఆయన త్వరలోనే రాజీనామా చేయనున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నెల 19న జరగనున్న ఆర్బీఐ బోర్డు సమావేశంలో అనారోగ్య కారణాల రీత్యా ఆయన తప్పుకోనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంతేకాదు ఊర్జిత్ పటేల్ రాజీనామా నిర్ణయం వాస్తవ రూపం దాలిస్తే.. అటు డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కూడా అదే బాటలో పయనించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పొగబెడుతున్న సభ్యులు..
ఆర్బీఐ గవర్నర్ దేశ ఆర్థిక ప్రాధాన్యతలను గుర్తించి, కేంద్రం ప్రతిపాదనలను ఆమోదించాలని, దీనిపై బోర్డు సభ్యులతో చర్చించాలని కోరుతున్నామని సీనియర్ ప్రభుత్వ అధికారి, బోర్డు సభ్యులు ఒకరు ఇటీవల వ్యాఖ్యానించారు. అంతేకాదు ఉర్జిత్ పటేల్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, ఆయన పదవి నుంచి తప్పుకోవడమే మంచిదని కూడా ఆయన పేర్కొన్నారు. మరో బోరు సభ్యుడు కూడా ఇదే విధంగా ఉర్జిత్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలక్ష ఉర్జిత్ మరింత ఒత్తిడికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది.