Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచిత్రమైన కారణాలు చూపుతూ నిర్ణయం..
- వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ముందుకే
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారు ప్రభుత్వ రంగంలోని చమురు, సహజ వాయువు ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీని (అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు అనూహ్య నిర్ణయాలతో సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టిన ప్రభుత్వం తాజాగా ఓఎన్జీసీకి చెందిన 149 చిన్న, మధ్య తరహా చుమురు, సహజ వాయువు క్షేత్రాలను విదేశీ సంస్థలకు, ప్రయివేటు సంస్థలకు అప్పగించాలని యోచిస్తోంది. ఇందుకు గాను ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇలా ఓఎన్జీసీ సంస్థకు చెందిన క్షేత్రాలను విక్రయించేందుకు గాను ప్రభుత్వం ప్రయత్నించడం ఇది రెండోసారి. 2017 అక్టోబరులో 'డైరెక్టొరేట్ జనరల్ అఫ్ హైడ్రోకార్భన్స్' (డీజీహెచ్) మేటి ఉత్పిత్తి సామర్థ్యం కలిగిన దాదాపు 15 చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షేత్రాలను గుర్తించింది. వీటి ఉమ్మడి ఉత్పత్తి సామర్థ్యాన్ని సంస్థ 791.2 మిలియన్ టన్నుల ముడి చమురు, 333.46 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువుగా లెక్క తేల్చింది. ప్రయివేటు సంస్థలైతే అంచనాల మేరకు వీటి నుంచి గరిష్ట స్థాయిలో ఉత్పత్తిని వెలికితీయగలవన్న అంచనాలతో వాటిని విదేశీ సంస్థలకు గానీ.. లేదా ఇతర ప్రయివేటు సంస్థలకు గానీ అప్పగించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే డీజీహెచ్ ప్రతిపాదనను ఓఎన్జీసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రయివేటు సంస్థలకు ఆఫర్ చేస్తున్నట్టుగానే ధరల నిర్ణయం, మార్కెటింగ్ విషయాల్లో తమకు కూడా పూర్తి వెసులుబాటును కల్పిస్తే ఈ క్షేత్రాలను తామే నిర్వహించి, మేటి ఉత్పత్తిని తీసుకురాగలమంటూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వచ్చింది. దీంతో అప్పట్లో కాస్త వెనకడుగు వెసినట్టు కనిపించిన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్లీ.. ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దాదాపు రూ.149 క్షేత్రాలను ప్రయివేటుకు అప్పగించే ప్రతిపాదనను తిరిగి తోడుతూ వేగంగా పావులు కదుపుతోంది.
ప్రధాని సమావేశంతో మారిన సీన్..
ప్రధాన మంత్రి మోడీ గత నెల 12న నిర్వహించిన చమురు శాఖ పనితీరు సమీక్షా సమావేశంలో ఓఎన్జీసీ క్షేత్రాల ప్రయివేటీకరణ ప్రతిపాదన కొత్త ములుపు తీసుకుంది. 2022 నాటికి దేశ అవసరాల కోసం చమురు దిగుమతిని10% మేర తగ్గించాలన్న యోచన మేరకు ఓఎన్జీసీకి చెందిన 149 చిన్న చమురు, సహజ వాయువు క్షేత్రాలను ప్రయివేటీకరించడమే మేలనే నిర్ణయం వెలువడినట్టు సమాచారం. దీనికి సంబంధించి చమురు శాఖ అధికారులు ప్రధానికి ఒక ప్రజెంటేషన్ ఇస్తూ.. ఓఎన్జీసీకి చెందిన దాదాపు 95 శాతం ఉత్పత్తి సంస్థకు చెందిన 60 పెద్ద క్షేత్రాల నుంచే వస్తోందని.. మొత్తం ఉత్పత్తిలో చిన్నచిన్న చమురు క్షేత్రాల వాటా కేవలం 5% మాత్రమేనని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిన్న క్షేత్రాలను ప్రయివేటీకరిస్తే.. ఓఎన్జీసీ పెద్ద క్షేత్రాలలో ఉత్పత్తిపై మరింత దృష్టి సారించేందుకు వీలు పడుతుందని అధికారులు ప్రధానికి తెలిపారు. ఇలా చేయడం వల్ల ఓఎన్జీసీ సంస్థ టేక్నాలజీ భాగస్వాములతో పీఈసీ, టెక్నికల్ సర్వీస్ అగ్రిమెంట్ చేసుకొనేందుకు వీలు పడుతుందని అధికారులు ప్రధానికి వెల్లడించారు. ఇదే కారణాలపై ప్రభుత్వం కూడా ఓఎన్జీసీకి చెందిన క్షేత్రాలను ప్రయివేటు సంస్థలకు అప్పగించేందుకు సుముఖంగానే ఉన్నట్టుగా సంకేతాలిచ్చింది. దీంతో ఈ చమురు క్షేత్రాల ప్రయివేటీకరణకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే పూర్తి స్థాయిలో పట్టాలెక్కనుందని సమాచారం. అయితే క్షేత్రాల నిర్వహణలో తాము టెక్నాలజీ అవుట్సోర్సింగ్ను వాడుకొనేలా వెసులుబాటు కల్పిస్తే తామే ఈ క్షేత్రాలను నిర్వహించగలమని.. ఇది దేశ హితానికి దోహదం చేస్తుందని ఓఎన్జీసీ వర్గాలు చెబుతున్నాయి.