Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో పరుగులు తీశాయి. సోమవారం నష్టాల్లో కదలాడిన సూచీలు మంగళవారం ఉదయం కూడా ఫ్లాట్గానే ప్రారంభమయ్యాయి. తర్వాత అనుకూల పవనాలతో లాభాల బాటపట్టాయి. బ్యాంకులు, ఆటో, లోహ, మౌలిక, చమురు రంగ షేర్లు లాభపడడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. రూపాయి కాస్త కోలుకోవడం, చమురు ధరలు పతనానికి అడ్డుకట్ట వేసేందుకు వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తిలో కోత విధించనున్నట్లు సౌదీ ప్రకటించడం, ఉర్జిత్ పటేల్ గత వారం ప్రధానితో సమావేశమయ్యారన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి రావడంతో కీలక సూచీలు భారీగా పుంజుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 34,846 వద్ద ప్రారంభం కాగా నిఫ్టీ 10,450 పాయింట్ల పైన ట్రేడింగ్ ఆరంభించింది. ఆరంభంలోనే కొద్దిసేపు ఒడిదొడుకులను ఎదుర్కొన్న సూచీలు మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల వెల్లువతో నిలదొక్కుకుని లాభాలను నమోదు చేశాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 331.5 పాయింట్లు లాభపడి 35144.49 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 100.3 పాయింట్లు లాభపడి 10582.50 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.62 వద్ద ట్రేడయింది. ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో రంగాలు పుంజుకోగా.. ఫార్మా రియల్టీ నష్టపోయాయి.