Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: భారత్లో ట్రక్కుల తయారీ దిగ్గజ సంస్థ అశోక్ లేలాండ్ సీఈవో-ఎండీ (సీఎండీ) పదవి నుంచి వినోద్ దాసరి వైదొలగనున్నారు. మంగళవారం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. 2019మార్చి 31 తేదీన తాను సీఈవోగా వైదొలగనున్నట్లు వెల్లడించారు. ''14 సంవత్సరాలపాటు అశోక్ లేలాండ్ సంస్థకు సీవోవోగా, సీఈవో-ఎండీగా సేవలు అందించిన వినోద్ దాసరి ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించాలని నిర్ణయించారు'' అని అశోక్ లేలాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన రాజీనామాను బోర్డు ఆమోదించినా.. మార్చి 31 వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది. ''కంపెనీలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. పరిశ్రమలో అశోక్ లేలాండ్ను ఆయన ఒక శక్తిగా తీర్చిదిద్దారు '' అని కంపెనీ ఛైర్మన్ ధీరజ్ జి. హిందుజ తెలిపారు. కాగా, మంగళవారం కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే 37శాతం అధిక లాభాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో మొత్తం నికర లాభం రూ.460 కోట్లుగా వెల్లడించింది.