Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: కరూర్ వైశ్య బ్యాంక్ (కేవీబీ) హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో గురువారం ఖాతాదారుల అవగాహన కార్యక్రమం జరిగింది. బ్యాంకింగ్ కోడ్లు, ప్రమాణాలపైన ఖాతాదారులకు అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బీసీఎస్బీఐ- ముంబయికి చెందిన సీనియర్ ఉపాధ్యక్షుడు సరోజ్ కుమార్ నాయక్ ప్రసంగిస్తూ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు ఖాతాదారులు కలిగి ఉండే వివిధ హక్కులను గురించి తెలియజేసేలా కేవీబీ ఏర్పాటు చేసిన కార్యక్రమం పట్ల ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఖాతాదారుల శ్రేయస్సు నిమిత్తం కేవీబీ తీసుకున్న చొరవను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. బ్యాంకు నుంచి మర్యాదపూర్వక ప్రవర్తన, పారదర్శకత, నిజాయితీతో కూడిన వ్యవహారాలు, గోప్యత, సమస్యకు పరిష్కారాలు పొందే హక్కులు బ్యాంకు వినియోగదారులు కలిగి ఉంటారనే అంశంపై కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర పరిధిలోని కేవీబీ బ్యాంకు ఖాతాదారులు, వివిధ బ్రాంచీ మేనేజర్లు పాల్గొన్నారు. డివిజనల్ హెడ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి. లక్ష్మణ మూర్తి, బ్యాంక్ చీఫ్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.