Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలను ప్రయివేటు శక్తులకు కట్టబెట్టడంలో మోడీ సర్కార్ ఎక్కడ లేని ఉత్సాహాన్ని చూపుతుంది. తాత్కాలిక లబ్ధి కోసం ఇప్పటికే పలు పిఎస్యుల్లోని వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించింది. తాజాగా రెండు సాధారణ బీమా సంస్థలు అయినా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జిఐసి), న్యూ ఇండియా అస్యూరెన్స్లో వాటాల ఉపసంహరణకు కేంద్ర ఆర్ధిక శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్ఎస్) ద్వారా ఇందులోని కొంత వాటాలను ఉపసంహరించుకోవడానికి కసరత్తు చేస్తుంది. గతేడాది అక్టోబర్లో జిఐసి, నవంబర్లో న్యూ ఇండియా అస్యూరెన్స్ సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి.
వీటిలో వాటా విక్రయించానికి డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) గురువారం మర్చంట్ బ్యాంకర్ల ఆసక్తిదారుల నుంచి దరఖాస్తులను కోరింది. ఈ వాటాల విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లు ఒక్కరిగా లేదా కన్సోరియంగా ఏర్పడి బిడ్లను వేయవచ్చు. 2018 డిసెంబర్ 7 కల్లా వాటా విక్రయ ప్రక్రియ ప్రారంభించాలని ఇందులో సూచించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం పలు పిఎస్యుల్లోని రూ.15,200 కోట్ల విలువ చేసే వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించింది. వచ్చే మార్చి నాటికి అన్ని పిఎస్యుల్లో కలిపి రూ.80,000 కోట్ల వాటాలను ఉసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.