Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా సంస్థ అదనంగా దాదాపు రూ.8000 కోట్ల మేర నిధులను సమీకరించుకొనేందుకు మార్గం సుగమమైంది. వివిధ మార్గాల ద్వారా ఈ నిధుల సమీకరణకు గాను చేసిన ప్రతిపాదనకు సంస్థ వాటాదారులు సమ్మతి తెలిపినట్టుగా జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా తెలిపింది. బుధవారం నాడు నిర్వహించిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు వాటాదారులు అవసరమైన మెజార్టీతో సమ్మతి తెలిపారని జీవీకే వెల్లడించింది. నిధుల సమీకరణకు గాను సంస్థకు చెందిన స్థిర, చరాస్తుల విక్రయం, లీజు, మార్టగేజ్ల మార్గలను పరిశీలిస్తున్నట్టుగా సంస్థ మార్కెట్లకు వెల్లడించింది. ఇందులో సంస్థకు సంభందించిన షేర్లు, సెక్యూరిటీలు కూడా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ ప్రక్రియల ద్వారా లభించే మొత్తాన్ని సంస్థ, అనుబంధ సంస్థలు, అసోసియేట్స్, గ్రూపు కంపెనీలు తప్పనిసరిగా చేయాల్సి ఉన్న చెల్లింపులకు వినియోగించనున్నట్టుగా కంపెనీ తెలిపింది. దీనితో పాటు జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్లో 50 శాతం ఈక్విటీ వాటాను డైల్యూట్ చేసే ప్రతిపాదనకు కూడా వాటాదారులు సమ్మతి తెలిపారని జీవీకే తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా గానీ.. లేదా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా గానీ.. లేదా వాటా విక్రయం ద్వారా గానీ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టుగా సంస్థ తెలిపింది. తద్వారా వచ్చే సొమ్మును జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ సంస్థ తప్పని సరగా చేయాల్సిన చెల్లింపులకు వాడనున్నట్టుగా కంపెనీ తెలిపింది.