Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ మరోమారు ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం- ఆర్బీఐ మధ్య అభిప్రాయ బేధాలు పెరిగిపోతోందన్న వార్తలపై ప్యానెల్ స్పందిస్తూ.. దీనిపై ఉర్జిత్ నుంచి వివరణ కోరాలని నిర్ణయించినట్టుగా సమాచారం. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థ పనితీరు, పెద్ద నోట్లరద్దు అనంతర పరిణామాలపై కూడా ప్యానెల్ ఉర్జిత్ను మరోమారు వివరణ కోరనున్నట్టుగా సమాచారం. మొత్త 31 మంది సభ్యులతో కూడిని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ నెల 27న ఉర్జిత్ను తమ ముందు హాజరు కావాల్సిందిగా వర్తమానం పంపినట్టుగా తెలుస్తోంది. ఆ కమిటీకి వీరప్ప మోయిలీ సారథ్యం వహిస్తుండగా.. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఉర్జిత్కు అధికారికంగా వర్తమానం పంపిన విషయాన్ని వీరప్ప మోయిలీ స్వయంగా ధ్రువీకరించారు. ఈ సమావేశంలో గవర్నర్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆర్బీఐలో సంస్కరణలు, పెద్దనోట్ల రద్దు తదితర అంశాలపై సమాచారం ఇవ్వనున్నట్టుగా తెలిపా రు. అయితే ఇటీవల కాలంలో ఆర్బీఐ- ప్రభుత్వం మధ్య అభిప్రాయ బేధాలు తారాస్థాయికి చేరి.. ఆర్బీఐపై సెక్షన్-7 అమలు వరకు వ్యవహారం వెల్లడంతో.. ప్యానెల్ ఈ అంశాన్ని చర్చకు తేనున్నట్టుగా సమాచారం. వాస్తవానికి ఈ నెల 12నే పటేల్ ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల దీనిని 27వ తేదీకి వాయిదా వేశారు.