Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-' జెట్' కొనుగోలుపై టాటా సన్స్ ప్రకటన
-కేవలం ప్రాథమిక చర్చలే జరిపినట్టుగా వెల్లడి
- టాటాల ఆసక్తి వార్తలు పూర్తిగా ఊహాగానాలే: జెట్
ముంబయి: పెరిగిన నిర్వహణ భారంతో మనుగడ కష్టంగా మారి కునారిల్లుతున్న జెట్ ఎయిర్వేస్ సంస్థలను టాటా సంస్థ కొనుగోలు చేయడం లేదు. ఈ విషయమై టాటా సన్స్ శుక్రవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి ఆ సంస్థతో తాము కేవలం ప్రాథమిక చర్చలు మాత్రమే జరిపినట్టుగా తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి తాము జెట్ ఎయిర్వేస్ యాజమాన్యానికి ఎలాంటి ప్రతిపాదనను చేయలేదని వెల్లడించింది. టాటా సంస్థ ఇప్పటికే రెండు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంలో విమానయాన సేవలను అందిస్తోంది. సింగపూర్ ఎయిర్లైన్స్ సంస్థతో కలిసి 'విస్తారా బ్రాండ్తోను.. మలేషియాకు చెందిన ఏయిర్ ఏషియాతో కలిసి భారత్లో ఏయిర్ ఏషియా సేవలను అందిస్తోంది. ఇదే తరుణంలో టాటా సన్స్ తమ అంతర్జాతీయ విమాన వ్యాపార భాగస్వామి ఎయిర్ ఏషియాతో కలిసి నరేష్ గోయెల్కు చెందిన జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేయనుందన్న వార్తలు ఇటీవల పతాక స్థాయిలో వచ్చాయి. ఈ నేపథ్యంలో టాటా సన్స్ శుక్రవారం బోర్డు సమావేశం నిర్వహించింది. ఆ తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి ఎలాంటి దృఢ నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఇదే విషయమై జెట్ ఎయిర్వేస్ సంస్థ స్టాక్ మార్కెట్లకు సమాచారం అందిస్తూ.. టాటా సన్స్ తమ సంస్థను కొనుగోలు చేయనుందంటూ వస్తోన్న వార్తల్లో ఉహాజనితమేనవేనని అన్నారు.
పరుగులు పెట్టిన స్టాక్స్..
జెట్ ఎయిర్వేస్ను టాటా సన్స్ కొనుగోలు చేయనుందన్న వార్తల నేపథ్యంలో గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఆ సంస్థ స్టాక్ దాదాఉ 40% మేర ఎగిసింది. టాటా సన్స్ బోర్డు సమావేశం నేపథ్యంలో బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ స్టాక్ దాదాపు 8 శాతం మేర పెరిగి రూ.346.85 వద్ద ముగిసింది. బోర్డు సమావేశంలో సానుకూల నిర్ణయం రానుందన్న వార్తల నేపథ్యంలో ప్రీ ట్రేడింగ్లోనే జెట్ స్టాక్ దాదాపు 14 శాతం మేర లాభంతో ప్రారంభమైంది.