Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.20వేల కోట్ల సమీకరణ: ఎస్బీఐ
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగ దిగ్గజం సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తమ వ్యాపార అవసరాల కోసం మరో రూ.20వేల కోట్ల మేర నిధులను సమీకరించేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు గాను తమకు వాటాదారుల నుంచి అనుమతి లభించినట్టుగా బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. బ్యాంక్ తాజాగా వాటాలను విక్రయించి ఈ మొత్తాన్ని సమీకరించనుందని ఎస్బీఐ అధికార వార్గలు తెలిపాయి. నిధుల సమీకరణ నిమిత్తం ముంబయిలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించినట్లు ఎస్బీఐ రెగ్యూలేటరీకి అందజేసిన ఫైలింగ్లో పేర్కొంది. ''రూ.20వేల కోట్లకు మించకుండా కొత్త వాటాల సృష్టి, ఆఫర్, జారీకి అవసరమైన అనుమతులు తీసుకున్నాం. వీటిని వివిధ రూపాల్లో జారీ చేస్తాము. ఈ జారీ విధానాన్ని బోర్డు సభ్యులు నిర్ణయిస్తారు.'' అని బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.
రూ.971 కోట్లు సమీకరించిన బీవోబీ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తాజాగా రూ.971 కోట్ల మేర నిధులను సమీకరించింది. బాసిల్-3 నిబంధనల మేరకు బాండ్లను జారీ చేయడం ద్వారా తాము అదనంగా ఈ నిధులను సమీకరించినట్టుగా బీవోబీ తెలిపింది. రూ.10 లక్షల ముఖవిలువ కలిగిన టైర్-2 బాండ్లను జారీ చేయడం ద్వారా తాము రూ.971 కోట్ల మేర నిధులను సమీకరించినట్టుగా బీవోబీ వర్గాలు తెలిపాయి. ఈ అన్సెక్యూర్డ్, రీడిమెబుల్ బాండ్లు వార్షికంగా 8.42 శాతం కూపెన్ రేట్ను కలిగి ఉంటాయని బ్యాంక్ తెలిపింది.