Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో పుంజుకున్నాయి. గురువారం భారీగా నష్టపోయిన మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. వాణిజ్య యుద్ధ పరిణామాలు కొంత మేర శాంతించడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడడం మార్కెట్లకు కలిసొచ్చింది. దీనికి తోడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలకు దరిదాపుల్లోనే ఉండనున్నట్టు వచ్చిన లీక్లతో మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు ఆద్యంతం లాభాలను కొనసాగించాయి. ఆటోమొబైల్స్, వినియోగ రంగ షేర్లు దూసుకెళ్లాయి. ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల లాభాలతో ట్రేడయ్యాయి. ఆద్యంతం లాభాలను కొనసాగించిన మార్కెట్లు చివరకు సెన్సెక్స్ 361 పాయింట్ల లాభంతో 35,673.25 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 92.55 పాయింట్ల లాభంతో 10.693.70 పాయింట్లకు చేరింది. కొటక్ మహీంద్రా షేర్లు భారీగా లాభపడ్డాయి. బ్యాంకులో వారెన్ బఫెట్ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో షేర్లు 9శాతం లాభపడ్డాయి. ఈరోజు ఎన్ఎస్ఈలో కొటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో తదితర కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి.
హెచ్సీఎల్ టెక్, గెయిల్, ఇండియాబుల్స్ హెచ్ఎస్జీ, సన్ ఫార్మా, కోల్ ఇండియా తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70.67 వద్ద కొనసాగింది.